వైభవంగా భూమా అఖిలప్రియ పెళ్లి, హరికృష్ణ విషాదంతో మారిన వీఐపీల షెడ్యూల్
ఆళ్లగడ్డ: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం ఆళ్లగడ్డలో ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త భార్గవరామ్తో వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరు కావాల్సి ఉంది.
కానీ నందమూరి హరికృష్ణ మృతితో ఎంతోమంది ఈ పెళ్లికి హాజరు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివాహానికి హాజరు కావాలి. గవర్నర్ నరసింహన్ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ వారు కూడా రాలేదు. ఏపీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణ, బంధుమిత్రులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ పెళ్లికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంగరంగవైభవ వేడుకకు టీడీపీ ముఖ్యులతో పాటు ఇతర కీలక నేతలను కూడా ఆహ్వానించారు. చిరంజీవి, కేసీఆర్ వంటి వారిని కూడా పిలిచారు అఖిలప్రియ. ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు సందడి చేయాల్సి ఉంది. కానీ హరికృష్ణ మృతితో విషాదం నిండింది.
బుధవారం ఉదయం పది గంటల 57 నిమిషాలకు అఖిలప్రియ వివాహం జరిగింది. అందుకు కొన్ని గంటల ముందే నందమూరి హరికృష్ణ చనిపోయారు. దీంతో వీఐపీల షెడ్యూల్ మారింది.