ఎన్డీఏలో కలుస్తామని చెప్పలేం, ఓ వర్గం మీడియా వక్రీకరించింది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. పంచభూతాలను కూడా పంచుకు తిన్నారని.. ఎవరినీ లెక్క చేయలేదన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి అప్పటి సీఎం చంద్రబాబు వరకు అప్పనంగా దోచేశారని పేర్కొన్నారు. లక్ష 80 వేల కోట్ల అప్పులు చేశారని.. కానీ సంపద మాత్రం సృష్టించలేదన్నారు. ఎందుకు ఆదాయం సమకూరలేదు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన ఆదివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏతో పొత్తు, శ్రీనివాస్పై ఐటీ దాడుల ఇతర అంశాలపై వివరించారు.
నగదు సీజ్ అని..
చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్పై ఐటీ శాఖ దాడులు చేసిందని, రూ.2 వేల కోట్ల పన్ను కట్టలేదని తేలిందని మాత్రమే చెప్పానన్నారు. అంతేకానీ రూ.2 వేల కోట్ల నగదు సీజ్ చేశారని గానీ, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అనలేదని స్పష్టంచేశారు. ఐటీ శాఖ ప్రకటనను మాత్రమే తాము చదివామే తప్పా.. సొంత భాష్యం చెప్పలేదన్నారు. కానీ దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడమని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
సొంత భాష్యం..
ఐటీ దాడులకు సంబంధించి విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇచ్చానని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్డీఏతో వైసీపీ కలుస్తోందా అని అడిగినా ప్రశ్నకు తాను ఔను అని కానీ, కాదు అని కానీ అనలేదని చెప్పారు. కానీ ఓ పత్రిక మాత్రం తాను అనని వ్యాఖ్యలను జోడించి వార్తను ప్రచురించిందని చెప్పారు. దానిపై శనివారం లేఖ కూడా విడుదల చేశానని గుర్తుచేశారు. మళ్లీ దానిపై ఆదివారం బొత్స అనలేదని రాశారని గుర్తుచేశారు. అలా కాదు తామే తప్పుగా రాశామని చెప్పాల్సింది.. తప్పుగా రాశారని మండిపడ్డారు. దానిని ఆధారంగా చేసుకొని ఇంగ్లిష్ పత్రికలు కూడా కథనాలు రాశారని.. అన్ని పత్రికలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బురదజల్లే యత్నం..
గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటీ నుంచి వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇటీవల తన మాటలను ఎలా వక్రీకరించారో వీడియోను కూడా చూపించారు. ఓ పత్రిక అధిపతి వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. మరోసారి ఏ పత్రిక కూడా కుంచిత ఆలోచనలు చేయకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎవరి వాదన వారిదే..
ఎన్డీఏతో కలుస్తామని తాము చెప్పలేదని.. కానీ బీజేపీ ఇంచార్జీ ముందుగానే స్పందించారని బొత్స వివరించారు. బీజేపీతో వైసీపీ పొత్తును అంగీకరించమని చెప్తున్నారని పేర్కొన్నారు. అసలు ఎవరూ కలుస్తామని చెప్పారు అని బొత్స ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసిన పవన్ కల్యాణ్.. వైసీపీ కలిస్తే.. మేం దూరంగా ఉంటామని అంటున్నారు.. ఇంతకీ ఆయనను ఎవరూ కలవమన్నారు. ఎవరూ వెళ్లమంటున్నారు అని అడిగారు.