ప్రజాధనం లూటీ చేయడమే చంద్రబాబు పని, లక్ష కోట్లు దోచేందుకు ప్రణాళిక: మంత్రి బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని మెసేందుకు భారీ ప్రణాళిక వేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తిచూపారు.
చంద్రబాబు నాయుడు బస్సు యాత్రం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కనీసం ఆ పార్టీ నేతలకు అర్థమవుతోందా అని నిలదీశారు. అమరావతి రాజధాని పేరుతో మోసానికి తెరతీశారని చెప్పారు. లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసేందుకు ప్రయత్నించారని.. కానీ దానిని గమనించి.. రాజధాని మార్పు చేయాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. దీంతో అధికార వికేంద్రీకరణ అవుతోందని.. అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్ను కోల్పోయామని.. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల సంగతేంటి అని అడిగారు. అలా కాకుండా ఉండేందు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం అందుకోసమేనని చెప్పారు. విశాఖను రాజధాని చేయమని ఎవరు అడిగారని కొందరు అంటున్నారు.. విశాఖ ప్రజలకు పరిపాలన రాజధాని అవసరం లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.