పవన్ కళ్యాణ్ మాట మార్చారు: సుజనా సవాల్ చేస్తే బయట పెడతాం: మంత్రి బొత్సా మరోసారి సంచలనం..!!
రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడా అమరావతి రాజధానిగా ఉంటుందా..ఉండదా అనే విషయం పైన మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో రాజధానిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని మీద గతంలో ఏం మాట్లాడారు.. ఇప్పుడేం మాట్లాడారో చూడాలని సూచించారు. మాజీ కేంద్ర మంత్రి.. ప్రస్తుత ఎంపీ రాజధానిలో నాకు భూములే లేవంటున్నారు.. సవాల్ విసిరితే మొత్తం బయట పెడతామని స్పష్టం చేసారు. రాజధానిలో జరిగిన అవినీతి గురించి సరైన సమయంలో బయటపెడతామని బొత్సా తేల్చి చెప్పారు. అక్కడి రైతులకు ఇవ్వాల్సిన కౌలు సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.
బొత్సా ఎక్కడా తగ్గటం లేదు..
మంత్రి బొత్సా రాజధాని గురించి తన వ్యాఖ్యలకు మరింత పదును పెడుతున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కు తగ్గటం లేదు. వారం రోజులుగా బొత్సా వ్యాఖ్యలతో రాజధాని మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇతర మంత్రులు కొందరు రాజధాని గురించి అనుమానాలు అవసరం లేదని..రాజధాని అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసారు. అయితే, బొత్సా మాత్రం తన మాటలను సమర్ధించుకుంటూ మరింత పదును పెంచారు. అందులో భాగంగా ఆయన ఈ సారి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని గుర్తు చేసారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ వివరాలు సరైన సమయంలో బయటపెడతామని ప్రకటించారు. అక్కడ జరిగిన అక్రమాల పైన పూర్తి సమాచారం సేకరించామని...సరైన సమయంలో భూ అక్రమాల చిట్టా బయటపెడతామన్నారు. దీని గురించి ప్రభుత్వంతో ఎవరూ మధ్య వర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చెబుతున్న నాలుగు రాజధానుల వ్యవహారం పైన ఆయన్నే సమాచారం అడగాలని తనకు దాని గురించి సమాచారం లేదని బొత్సా వివరించారు.
పవన్ కళ్యాన్ మాట మార్చారు..
జనసేన అధినేత తో తాజాగా రాజధాని రైతులు కలిసిన సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి బొత్సా స్పందించారు. గతంలో పవన్ ఏరకంగా మాట్లాడారో..ఇప్పుడు ఏం మాట్లాడారో రికార్డులు చూడాలని సూచించారు. ఆయన ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కూడా గతంలో రాజధాని మీద ఆరోపణలు చేసిందని..ఇప్పుడు వైఖరి మార్చుకుందా అని ప్రశ్నించారు. రాజధాని మీద విచారణ జరగాలని అనేక మంది బీజేపీ నేతలు డిమాండ్ చేసారని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని..రాష్ట్ర ప్రజలందరిదీ అని బొత్సా వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు తమకు కౌలు అందటం లేదని ఆందోళన చెందుతున్న విషయం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి..త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటించారు. ఇక, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బొత్సా సవాల్ చేసారు. మాజీ కేంద్ర మంత్రి..ప్రస్తుత ఎంపీ రాజధానిలో తనకు భూములే లేవంటున్నారని..ఆయన సవాల్ విసిరితే మొత్తం బయట పెడతామని పరోక్షంగా బొత్సా సుజనా చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజధానిలో బీజేపీ నేతల పర్యటన..
రాజధాని రైతులు తమను కలిసి ..రాజధాని తరలించకుండా చూడాలని కోరటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ..రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. మంగళ..బుద వారాల్లో వారు పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30, 31 తేదీల్లో రాజధానిలో పర్యటిస్తానని ప్రకటించారు. దీంతో..పవన్ కంటే ముందుగానే రాజధాని ప్రాంతంలో పర్యటించి భవిష్యత్ ప్రణాళిక ఖరారు చేయాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, ఇదే సమయంలో రాజధానిలో జరుగుతున్న అవినీతి పైన గతంలో బీజేపీ నేతలు.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు స్వరం మారిందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయంగా రగడకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.