ప్రజావేదిక కూల్చడం కక్షసాధింపు చర్య కాదు.. చంద్రబాబు ఇంటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : బొత్స
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసేది లేదన్నట్లుగా ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించినట్లుగానే.. అన్నంత పని చేశారు. అయితే జగన్ తీరును తప్పుపడుతూ టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తుంటే వైసీపీ నేతలు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు.
ఆ క్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ప్రజావేదికను అక్రమంగా నిర్మించినందునే సీఎం జగన్ దానిని కూల్చివేయాలనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రజావేదికను కూల్చడమనేది టీడీపీ నేతలపై కక్షసాధింపు ధోరణితో చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కంటిన్యూ అవుతుందని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకెళుతుందని వ్యాఖ్యానించారు.
Recommended Video
వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం
ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించిన ఇంటి వ్యవహారానికి సంబంధించి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు బొత్స. అయితే చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమి లేదని చెప్పుకొచ్చారు. నిబంధనలు అనుసరించి అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
నాలుగు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన బొత్స.. చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్డగోలుగా నిర్మించారని ధ్వజమెత్తారు. అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ నోటి మాటతో అంచనాలు పెంచేసిన సందర్భాలున్నాయని మండిపడ్డారు. 5 కోట్ల రూపాయల నిర్మాణ అంచనాలను అమాంతం 8 కోట్ల 90 లక్షలకు పెంచారని ఆరోపించారు. మొత్తానికి ప్రజావేదిక కుప్పకూలుతున్న తరుణంలో చంద్రబాబు ఇంటిపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.