ఇంత దిగజారుడా: అడ్డంకులు సృష్టించడమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవమా?: బొత్స ఫైర్
విజయవాడ: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడటం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. దీనికి ప్రధాన కారణం- తెలుగుదేశం పార్టీ నాయకులేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో పని చేస్తోన్న టీడీపీ నాయకులు.. రాష్ట్ర పరిపాలనకు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు చివరికి.. పాలనలో అడ్డంకులు సృష్టించడానికి వినియోగిస్తుండటం తనకు ఆవేదన కలిగిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు అడ్డకున్నా.. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ధోరణిని ప్రదర్శించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సోమవారం విజయవాడలో బొత్స సత్యనారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సింగ్నగర్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ పార్క్ అభివృద్ధి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పేదలకు తమ ప్రభుత్వం మంచి చేస్తోంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. న్యాయస్థానాల నుంచి స్టే తీసుకొచ్చి మరీ టీడీపీ నాయకులు రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్నారని చెప్పారు.
తన హయాంలో చంద్రబాబు ఒక్క ఇంటిని కూడా నిర్మించి పేదలకు ఇవ్వలేదని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఆలస్యం కావచ్చేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంతకంటే దిగజారిపోరని అనుకున్న ప్రతీసారీ.. అంతకంటే దిగజారిపోతున్నారని, ఈ విషయంలో రికార్డులు బద్దలు కొట్టారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ పసలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్దారు.