సుజనా చౌదరీ పార్టీ మారారు తప్ప, మనిషి మారలేదు : బోత్స సత్యనారయణ
బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ పై ఏపీ పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం పై నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే విమర్శలు చేస్తూ, గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరీ పార్టీ మారారు తప్ప ఆలోచనలు మాత్రం మారలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఆయన అడిగిన వాటికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పాలా అంటూ ప్రశ్నించారు. సుజనా చౌదరీ మూలాలు ఇంకా టీడీపీలో ఉన్నాయని దుయ్యబట్టారు.
ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రం ప్రశాంతం ఉందని , దీన్ని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు. ఇక ప్రతిపక్ష టీడీపీ చిన్న అంశాలను కూడ భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెయిడ్ అర్టిస్టులతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని నొక్కి చెప్పారు.
మరోవైపు వందరోజుల పాలనలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పెద్దపీట వేశారని అన్నారు. ఇక ప్రాజెక్టులన్ని జలకళతో ఉట్టిపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలో తీసుకుపోయేందుకు గ్రామ వాలింటర్లను నియమించామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఒక లక్ష 34 మంది గ్రామకార్యదర్శులు విధుల్లో చేరనున్నట్టు ఆయన చెప్పారు.