అమరావతి గ్రామాల్లో మంత్రి బొత్స వరుస పర్యటనలు- జగన్ సర్కార్ తాజా ప్లాన్ ఇదేనా ?
ఏపీలో ఓవైపు రాజధానుల వికేంద్రీకరణకు చురుగ్గా పావులు కదుపుతున్న ప్రభుత్వం మరోవైపు ప్రస్తుత రాజధానిగా ఉన్న అమరావతి గ్రామాల్లో పరిస్దితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. పురపాలకమంత్రి బొత్స సత్యనారాయణ రెండు రోజులుగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి పెండింగ్ పనులపై దృష్టిసారించడం, స్ధానిక నేతలతో వ్యూహాత్మక సమావేశాలు భవిష్యత్తు పరిణామాలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి...
రాజధానిలో బొత్స వరుస పర్యటనలు....
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో గత రెండు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్ధానికంగా ఉన్న పరిస్ధితులను అధికారులతో కలిసి అంచనా వేస్తున్నారు. అక్కడి రైతులతో కూడా అక్కడక్కడా మాట్లాడుతున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీలు కూడా ఇస్తున్నారు. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇంత అర్ధాంతరంగా మంత్రి బొత్స పర్యటించడం పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.
తరలింపు వ్యూహాల మధ్యే...
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం... అమరావతి గ్రామాల్లో భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో పురపాలక మంత్రి కూడా అయిన బొత్స వరుస పర్యటనల ద్వారా ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే అమరావతిలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రూ.18 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బొత్స పెండింగ్ నిర్మాణాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
రాజధాని మార్పు వాయిదా ప్రభావం...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజధాని మార్పును ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసుకుందని తాజా పరిణామాలు, మంత్రుల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమరావతిలో పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని విస్మరించడం లేదనే సంకేతాలను రైతుల్లో పంపాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా అమరావతిలోనూ అభివృద్ధి వదిలిపెట్టలేదనే సంకేతాలను విపక్షాలకు సైతం పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో కొత్త ప్రాజెక్టులు ?
అమరావతి రాజధాని ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శిస్తున్న వైసీపీ సర్కార్... తాజాగా తాము చేపట్టబోయే ప్రాజెక్టులపై ఓ అంచనాకు వచ్చేందుకే మంత్రి బొత్సను ముందుగా అక్కడికి పంపినట్లు మరో ప్రచారం సాగుతోంది. రాజధానిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు, స్ధానికంగా ఉన్న పరిస్ధితులను అధికారులతో కలిసి మంత్రి బొత్స అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించినా శాసన రాజధాని కొనసాగుతుందని, ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ హబ్ లుగా అభివృద్ధి చేస్తామని పలు సందర్భాల్లో చెప్పింది. దీన్ని బట్టి చూసినా భవిష్యత్ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలు పరిశీలించేందుకే మంత్రి బొత్స అక్కడ పర్యటిస్తున్నట్లు అనధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.