కళ్ల ముందు జైలు వూచలు కనబడేసరికి జగన్ వెళ్లి మోడీ కాళ్లపై పడ్డారు : దేవినేని ఉమా
ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని, కళ్ల ముందు జైలు వూచలు కనబడుతున్నాయి కాబట్టే కేసులు మాఫీ చేయించుకునే పనిలో పడ్డారని ఘాటుగా విమర్శించారు.
విజయవాడ: పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.
జగన్ ఎవరి కాళ్లు పట్టుకున్నా ఆయనపై ఉన్న అవినీతి కేసులు మాఫీ కాబోవని విమర్శించారు. 16 నెలలు జైల్లో గడిపిన జగన్ ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ కళ్ల ముందు జైలు వూచలు కనబడుతున్నాయి కాబట్టే కేసులు మాఫీ చేయించుకునే పనిలో పడ్డారని ఘాటుగా విమర్శించారు. అగ్రి గోల్డ్పై అసెంబ్లీలో చర్చిద్దామంటే పారిపోయిన జగన్ ఇప్పుడు అదే అంశంపై ప్రధాని మోడీని కలవడం విచిత్రంగా ఉందన్నారు.
మిర్చి రైతులకు రూ.5 వేలు కేంద్రం ప్రకటించినట్లు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కూడా రాజకీయం చేసి మాట్లాడటం ప్రతిపక్షానికి తగదని, మోడీ కాళ్లపై పడినా కేసులు మాఫీ కావని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.