పోలవరం ఎలా : కేంద్రంపై సుజాత అసంతృప్తి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అసంతృప్తి వ్యక్తంచేశారు. కేటాయింపులు ఇలావుంటే ఈ ప్రాజెక్టు వందేళ్లయినా పూర్తికాదని ఆమె అన్నారు. కేంద్రబడ్జెట్ తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. ఏలూరులో ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రైల్వే, సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని, దీన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించకపోతే ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారే ప్రమాదముందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో ప్రతీ మంత్రిని కలిశారని, అయితే ఆంధ్రప్రదేశ్కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్రం దాన్ని చేతల్లో చూపలేదని చెప్పారు.
బిజెపితో స్నేహసంబంధాలను కొనసాగించుకుంటూ వస్తున్నామని, అయితే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో వుందని, అయినప్పటికీ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 16 వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్తో వున్నామన్నారు.
మహిళా సంక్షేమం, సమగ్ర శిశు సంరక్షణ పధకాలకు గత ఏడాదికన్నా ఈ ఏడాది బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం తనకు శాఖాపరంగా అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమానికి 1100 కోట్ల రూపాయలు కేటాయించారని, ఇటీవల తాను కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందించానని, బడ్జెట్లో ఈ కేటాయింపులు చూస్తుంటే రాష్ట్రంలో ఐసిడి ఎస్ పధకాలను ఎలా నిర్వహించాలో అర్ధంకావడం లేదని అన్నారు.