తెలుసుకొని మాట్లాడు, నినాదం ఒక్కటే: అసదుద్దీన్కు ఏపీ మంత్రి గట్టి కౌంటర్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి ఫరూక్ బుధవారం మండిపడ్డారు. అలాగే, ఏపీకి వెళ్తానని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్కు, ఏపీకి వస్తానన్న అసదుద్దీన్కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు.
ఏపిలో జగన్ కు మద్దతిస్తా: నా ప్రభావం ఏంటో బాబుకు చూపిస్తా : అసద్ కీలక నిర్ణయం..
మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోందని చెప్పారు. ముస్లీంల అభ్యున్నతికి చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. మీదీ.. మాదీ.. ఒకటే నినాదమని, మోడీ హఠావో.. దేశం బచావో అని అసదుద్దీన్కు గుర్తు చేశారు. అలాగే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.
Recommended Video
జగన్ ఎవరి వైపు ఉన్నాడో తెలుసుకో
అసదుద్దీన్ ఓవైసీ తమ రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) వచ్చి ప్రచారం చేసుకోవచ్చునని ఫరూఖ్ చెప్పారు. పోటీ కూడా చేయవచ్చునని చెప్పారు. కానీ ఇద్దరిదీ ఒకటే నినాదమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో లాలూచీపడిన జగన్కు మద్దతిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. జగన్ ఎవరి వైపు ఉన్నారో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ తర్వాత అసదుద్దీన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతలు బాలకృష్ణ, పరిటాల సునీత వంటి వారు కూడా రంగంలోకి దిగారు. పైగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో అసదుద్దీన్.. కేసీఆర్ వెంట ఉన్నారు. చంద్రబాబు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జత కలిశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఆ తర్వాత అసదుద్దీన్ ఏపీలో పర్యటిస్తామని మాట్లాడుతున్నారు. తాను ఏపీకి వచ్చి చంద్రబాబు రివర్స్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పగా, చంద్రబాబు రెండు సీట్లు గెలిపించుకోలేకపోయారని అసదుద్దీన్ అన్నారు. చంద్రబాబుకు ఏపిలో తన సత్తా చూపిస్తానని, జగన్కు మద్దతిస్తానని చెప్పారు. ఏపీలో చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో కూడా గెలవలేదన్నారు. కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారన్నారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని హెచ్చరించారు. దీనిపై ఫరూఖ్ మండిపడ్డారు.
పలువురు నేతల స్పందన
కేసీఆర్, అసదుద్దీన్ వ్యాఖ్యలపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. కేసీఆర్ వస్తాననగా.. చంద్రబాబు కూడా స్వాగతించారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎక్కడికైనా రావొచ్చునని చెప్పారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా కేసీఆర్ ప్రకటనను స్వాగతించారు. ఏపీకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే
కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్కు వస్తే తాము ఆహ్వానిస్తామని ముద్రగడ పద్మనాభం బుధవారం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన ఆయన మాటలను స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబును సాగనంపే వరకు తాము విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు సంతృప్తికరంగా లేదని పెదవి విరిచారు.