‘నిండా మునిగిన జగన్! ఎన్ని పొర్లుదండాలు పెట్టినా సీఎం కాలేడు’
విజయవాడ: ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్రతో పాటు పొర్లుదండాలు పెట్టినా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి బుధవారం మంత్రి కొల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాదయాత్రలు, ఓదార్పు యాత్రల పేరిట ప్రజల్ని రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసులో నిండా మునిగిన జగన్ ఎప్పటికీ సీఎం కాలేరన్నారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమూ చేయని విధంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక పేరిట రూ.30 వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా అందజేస్తామన్నారు.
16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్.. కోర్టు కేసులతో భవిష్యత్తులో ఏ జైలుకు వెళ్తారో తెలీదని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. 2019 ఎన్నికలు అభివృద్ధికి, అవినీతికి మధ్య జరగనున్నాయని వ్యాఖ్యానించారు.
హోదాపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదం
ప్రత్యేక హోదాపై విపక్ష నేత జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కొన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదాను దేశంలో ఏ రాష్ట్రానికి అమలు చేయడం లేదని తెలిపారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఆర్థిక సాయం అందుతూనే ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కంటే పొరుగు రాష్ట్రాలకు జీఎస్టీలో పన్ను మినహాయింపులు ఎక్కువ ఇచ్చారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కొన్ని చిన్న రాష్ట్రాలకు అదనపు సాయం అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని... దీనివల్ల మన రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానంగా జీఎస్టీ అమలవుతోందని ఆయన స్పష్టం చేశారు.