ఏపీలో స్ధానిక ఎన్నికలు కష్టమే- బాంబు పేల్చిన మంత్రి గౌతంరెడ్డి-ఈసీ ఏర్పాట్ల వేళ...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న వేళ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బాంబుపేల్చారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదన్నారు. దీంతో ఎన్నికల నిర్వహణక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీలో ఈ ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. దీనిపై ఆగ్రహంతో ఆయన్ను ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ పదవి నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అక్షింతల తర్వాత తిరిగి అదే పదవి అప్పగించాల్సి వచ్చింది. అయితే బాధ్యతలు చేపట్టగానే తిరిగి నిమ్మగడ్డ రమేష్ స్ధానిక ఎన్నికలపై దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
Recommended Video
స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వ సహకారం లేదంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తగిన సహకారం అందించాలని సూచించింది. అయితే ఇప్పుడు రాష్ట్రమంత్రి గౌతంరెడ్డి ఎన్నికలపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని చెప్పడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయని, దసరా తర్వాత సెకండ్ వేవ్ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. బీహార్లో రాష్ట్ర ఎన్నికలు కాబట్టి కచ్చితంగా నిర్వహించి తీరాలని, వాటితో ఏపీలో స్ధానిక ఎన్నికలకు పోలిక లేదన్నారు.