కోటంరెడ్డికి కాకాణి ఘాటు కౌంటర్- ట్యాపింగ్ పై కోర్టు కెళ్లొచ్చు, కేంద్రాన్నీ ఆశ్రయించాలని సూచన..
ఫోన్ ట్యాపింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నెల్లూరు రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి కాకాణి ఘాటు కౌంటర్ ఇచ్చారు. పోతూ పోతూ అభాండాలెందుకని ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. కోటంరెడ్డి బ్లాక్ బెయిల్ చేస్తున్నారంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఇవాళ కోటంరెడ్డి ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీంతో కోటంరెడ్డి కామెంట్స్ పై మంత్రి, ఆయన బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ సర్కార్ పై కోటంరెడ్డి చేస్తున్న కామెంట్స్ కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డి ఆరోపించినట్లు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు చంద్రబాబు ఉచ్చులో పడి కోటంరెడ్డి వైసీపీని విమర్శిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్ లో శ్రీధర్ రెడ్డి పడ్డారని, శ్రీధర్ రెడ్డి ఆవేశంతో కాదు, ఆలోచనతో మాట్లాడాలన్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఆడియోను ఆపాదించి పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని అవమానిస్తున్నారని కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డిని అరెస్టులు, ఎన్న్ కౌంటర్లు చేయాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు లో వైసీపీ అన్ని స్ధానాలు గెలుస్తుందన్నారు. కోటంరెడ్డి చెబుతున్నట్లు ట్యాపింగ్ జరగలేదని కాకాణి తెలిపారు. ట్యాపింగ్ ఆరోపణలు నిజమా కాదా శ్రీధర్ రెడ్డి రుజువు చేయాలన్నారు. ట్యాపింగ్ పై కోర్టుకెళ్లొచ్చు, కేంద్రాన్ని కూడా ఆశ్రయించవచ్చని కోటంరెడ్డికి సలహా ఇచ్చారు. చంద్రబాబుకు ఫోన్ ట్యాపింగ్ కూ, రికార్డింగ్ కు తేడా తెలియదు కాబట్టి, చంద్రబాబు మిడిమిడి జ్ఞానం, క్రిమినల్ మెంటాలిటీ మూలాలు శ్రీధర్ రెడ్డికి కనెక్ట్ చేసారని కాకాణి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అనవసర రాద్ధాంతాలొద్దని కోటంరెడ్డికి కాకాణి సూచించారు. వెళ్లిపోవడంలో ఇబ్బందిలేదు, కన్నతల్లి లాంటి పార్టీపై అభాండాలు వేయొద్దని సలహా ఇచ్చారు.