పవన్ కల్యాణ్పై మంత్రి కన్నబాబు గుస్సా.. స్వార్థ రాజకీయాలు వద్దు అని హితవు..
జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. అయినా పవన్ కల్యాణ్ వ్యవహారశైలిలో మార్పు మాత్రం రాలేదన్నారు.
మహిళలపై లైంగికదాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని యావత్ జాతి కోరుకుంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బెత్తం, పూలతో కొడితే చాలని వింతగా వాదిస్తున్నారని ఫైరయ్యారు. దీనిపై ప్రజల అభిప్రాయంతో పనిలేదా అని విమర్శించారు. మీ సొంత అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దుతారా అని ప్రశ్నించారు.
మాటికి ప్రజా సమస్యలు అనే పవన్ కల్యాణ్ లైంగికదాడులపై మాత్రం భిన్నంగా వాదన వినిపిస్తున్నారని ఫైరయ్యారు. 11 ఏళ్ల క్రితం యాసిడ్ దాడి నిందితులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ కౌంటర్ చేయించారని పేర్కొన్నారు. ఆనాటి సంప్రదాయాన్ని తెలంగాణ పోలీసులు కొనసాగించారని కన్నబాబు గుర్తుచేశారు. వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకొని.. ఎన్కౌంటర్ చేసే ధైర్యం చేశారని చెప్పారు.
దిశ హత్య కేసు నిందితులపై పోలీసులు కాల్పులను ఆయన స్వాగతించారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో దుండగులు దాడి చేయడంతో వారి వైఖరేంటో అర్థమైందన్నారు. వారికి ధీటుగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వారు కాల్పులు జరపకుండా ఉంటే.. పారిపోయి మరిన్ని ఘాతుకాలకు పాల్పడేవారని ఆందోళన వ్యక్తం చేశారు.