నాడు హరికృష్ణ..నేడు శ్రావణ్ కుమార్.. పాపం కిడారి.. !
ఆ ఇద్దరిదీ ఒకే పరిస్థితి. నాడు హరికృష్ణ. నేడు శ్రావణ్ కుమార్. రాజకీయ పరిస్థితుల కారణంగా సెంటిమెంట్తో వారికి పదవులు కట్టబెట్టారు. కానీ, వారికి మంత్రి పదవి ఆర్నెళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.మంత్రిగా అయిన ఆరు నెలల లోగా చట్ట సభలకు సభ్యుడవ్వాలని పార్టీ అధినేతకు తెలుసు. కానీ, ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో.. నాడు హరికృష్ణ..నేడు శ్రావణ్..ఇద్దరూ ఒకే రకంగా కేబినెట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
హరికృష్ణకు ఇదే పరిస్థితి..
ఎన్టీఆర్ తనయుడు సైతం మంత్రి పదవి నుండి ఇదే విధంగా దిగిపోవాల్సి వచ్చింది. తాజాగా కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో ఇప్పడు అందరూ నాడు హరికృష్ణకు ఎదురైన పరిస్థితని గుర్తు చేసుకుంటున్నారు. 1995లో వెన్నుపోటు ఎపిసోడ్లో తనకు అండగా నిలిచినందుకు నజరానాగా చంద్రబాబు హరికృష్ణను రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. కానీ చట్టసభకు మాత్రం పంపకపోవడంతో అర్నెల్లు ముగిసిన వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే, నాటి వెన్నుపోటు సమయంలో మద్దతు కోసమే హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి..ఉద్దేశ పూర్వకంగానే చట్ట సభలో సభ్యత్వం ఇవ్వలేదనే ఆరోపణ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.
ఇప్పుడు గిరిజన నేతకు ఇలా..
ఇప్పుడు గిరిజన వర్గానికి చెందిన కిడారి శ్రావణ్ కుమార్ అనూహ్య పరిస్థితుల్లో మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల్లో అరకు లోయ నుండి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఆయనకు కొంత కాలం తరువాత విప్ పదవి కట్టబెట్టారు.ఆ పదవిలో ఉండగానే ఆయన్ను గత ఏడాది మావోయిస్టులు హతమార్చారు. అప్పటికే గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు..గిరిజన సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో..గిరిజనుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి.అదే సమయంలో గిరిజన ఎమ్మెల్యే హత్య కారణంగా వారిలో ప్రభుత్వం పైన అపనమ్మకం ఏర్పడుతుందని గ్రహించిన చంద్రబాబు సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ ను మంత్రిని చేసారు. అయితే, మంత్రి అయిన ఆరు నెలలలోగా ఏదైనా సభ నుండి సభ్యుడుగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఇది అమలు కాకపోవటంతో ఇప్పుడు శ్రావన్ రాజీనామా తప్పలేదు.
నిబంధనలు తెలిసినా..
రాజ్యంగ నిబంధనలు తెలిసినా..నాడు హరికృష్ణ విషయంలో..నేడు శ్రావణ్ విషయంలోనూ టీడీపీ అధినేత ఒకే రకంగా వ్యవహరించారనే విశ్లేషణలు మొదలయ్యాయి. శ్రావణ్ మంత్రి అయిన తరువాత పలువురు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కించుకున్నారు. శ్రావణ్ను మాత్రం ఎమ్మెల్యేగా బరిలోకి దించారు. అయితే, ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన వారూ టీడీపీలో ఉన్నారు. శ్రావణ్ మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికల్లో ఆయనతో పాటుగా టీడీపీ గెలిస్తే మంత్రి పదవి కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నిక పూర్తయినా..ఫలితం రాకపోవటంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధలు తెలిసినా..టిడీపీ అధినాయకత్వం రాజకీయంగా ప్రయోజనాల కోసమే మంత్రి పదవులు ఇచ్చి..ఇప్పుడు మౌనంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.