పౌరసత్వ చట్టంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఏపీ అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం: మంత్రి మాటలకు అర్థం..!
విజయవాడ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరబోతోందా? ఈ రెండింటినీ తాము అమలు చేయబోమంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుందా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలను అమలు చేయబోమంటూ హామీ ఇస్తున్నారు. తనను కలిసిన ముస్లింల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు.
ఢిల్లీ నుంచి కేరళ దాకా..
పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. దేశ రాజధాని మొదలుకుని కేరళ దాకా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దీనికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగాయి. అవి కాస్తా హింసాత్మకంగా రూపుదాల్చాయి. కర్ణాటకలో దీని తీవ్రత కాల్పుల వరకూ వెళ్లింది. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల భగ్గుమంటున్నాయి. విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ ఆందోళనల్లో భాగస్వామ్యులు కావడం.. వాటి తీవ్రతను మరింత పెంచినట్టయింది.
కేరళ, పంజాబ్ అసెంబ్లీల్లో తీర్మానం..
పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదును గానీ తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఇప్పటికే కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలను సైతం చేశాయి. వాటి ప్రతులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించాయి. ఈ రెండూ బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నవే. మొదటి నుంచీ ఈ రెండు కార్యక్రమాలనూ వ్యతిరేకిస్తూ వస్తోన్నవే. పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తీర్మానం చేయబోతోంది.
అదే జాబితాలో ఏపీ కూడా..
మన రాష్ట్రంలోనూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. కడప, అనంతపురం జిల్లా కదిరి, చిత్తూరు జిల్లా మదనపల్లి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అవేవీ హింసాత్మకంగా రూపుదాల్చలేదు. అల్లర్లకు తావివ్వలేదు. శాంతియుత వాతావరణంలో ఆయా ప్రదర్శనలు కొనసాగాయి. ముస్లింలల్లో నెలకొన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని అమలు చేయకూడదంటూ ఇదివరకే నిర్ణయం తీసుకుంది.
ఏపీ అసెంబ్లీలో కూడా తీర్మానం..
పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ రెండు చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ముస్లింల మనోభావాలను తమ ప్రభుత్వం గౌరవిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదును గానీ రాష్ట్రంలో అమలు చేయబోమని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా అసెంబ్లీలో ఓ తీర్మానం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ముస్లింల పక్షపాతి అని, వారికి ముప్పు కలిగించేలా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోరని అన్నారు.