చంద్రబాబుకు కొడాలి నాని సవాల్- దమ్ముంటే ఉప ఎన్నికలు కోరండి- గెలిస్తే పునరాలోచిస్తాం...
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు వీలుగా గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులు ఆమోదించడంపై నిన్న చంద్రబాబు చేసిన కామెంట్లపై కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుకు అంత దమ్మూ, ధైర్యం ఉంటే అమరావతి అజెండాపై తన ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ఫలితాలపై అప్పుడు తేల్చుకుందామని చంద్రబాబుకు కొడాలి స్పష్టం చేశారు.
చంద్రబాబుపై కొడాలి ఫైర్...
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేరు చెబితేనే మండిపడే ఏపీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా అసెంబ్లీ ఆమోదించి పంపిన రెండు బిల్లులను గవర్నర్ హరిచందన్ ఆమోదించిన నేపిథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. ప్రజాభీష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారని ఇందులో ఆశ్చర్యమేముందని కొడాలి ప్రశ్నించారు. ఇప్పటికే రాజధానిగా చెప్పుకుంటున్న అమరావతిలో టీడీపీ పరిస్ధితి ఏంటో తెలుసుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.
చంద్రబాబుకు కొడాలి సవాల్...
చంద్రబాబుకు దమ్ముంటే తన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి అమరావతి అజెండాతో ఉప ఎన్నికలకు వెళ్లాలని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబు 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచించే అవకాశం ఉంటుందని, అలా కాక ఓడిపోతే జగన్ నిర్ణయానికి మద్దతుగా రావాలని చంద్రబాబుకు సూచించారు. అమరావతికి భూములిచ్చిన రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే నువ్వూ, నీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయండని కొడాలి స్పష్టం చేశారు. అమరావతిపై దేనికైనా సిద్దమంటున్న చంద్రబాబు తన సవాల్ స్వీకరించాలన్నారు.
బాబుది పిచ్చివాగుడు....
చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు లేకుండా జూమ్ యాప్ లో పిచ్చి వాగుడు వాగుతున్నారని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. సీమ జిల్లాల్లో 52 సీట్లుంటే బావ, బామ్మర్ది బాలయ్య మాత్రమే గెలిచారని, అక్కడ ప్రజలు చీదరించుకున్నా చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదని కొడాలి ఆక్షేపించారు. టీడీపీ కంచుకోట ఉత్తరాంధ్రలోనూ జగన్ మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారని కొడాలి తెలిపారు. చివరికి ముఖ్యమంత్రిగా రాజధాని పెట్టినా అమరావతిలో ప్రజలు కుమారుడు లోకేష్ ను కూడా ఓడించారన్నారు.
Recommended Video
మరో ఉద్యమం..మరో ఉద్యమం రాకుండా...
సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఏకైక ఆకాంక్షతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, లేకపోతే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు కన్న కలలను ఆయన తర్వాత ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరడం మూర్ఖత్వమని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్ధితుల్లో ఒకే చోట లక్ష కోట్లు పెట్టి మహానగరం నిర్మించడం సాధ్యం కాదన్నారు. అమరావతిలో అయ్యే ఖర్చులో పది శాతం విశాఖలో పెడితే మహానగరాలకు దీటుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మంత్రి కొడాలి గుర్తు చేశారు.