దమ్ముంటే నా చొక్కా పట్టుకో- పవన్కు కొడాలి సవాల్- తొడలు, మెడలు రుద్దుకుంటే నమ్మరు
కృష్ణాజిల్లా పర్యటనలో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ఆళ్ల నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పవన్ వ్యాఖ్యలకు ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు పలువురు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించిన కొడాలి నాని.. ఇవాళ మరోసారి పవన్కు సవాల్ విసిరారు. చంద్రబాబుకు కష్టమొస్తే వాలిపోతున్న పవన్... ఎంత ఊగిపోయినా ప్రజలు నమ్మబోరని కొడాలి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి ఆయనేం తెలుసో చెప్పాలన్నారు.
చంద్రబాబుకు కష్టమొస్తే చాలు..
పార్టనర్ చంద్రబాబుకు ఆపద ఎదురైతే వెంటనే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో దిగిపోతున్నాడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం అనమనపూడి గ్రామంలో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు . పవన్ కళ్యాణ్ తాను ఎవరికీ భయపడడం లేదని పదేపదే చెప్తుంటాడని , ఆయనను ఎవరు భయపెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు . రాజకీయంగా ఎంతో మంది నాయకులు తిరుగుతూ ఉపన్యాసాలు చెప్తుంటారని , ఎవరేం చేస్తున్నారో ప్రజలకు మాత్రం తెలుసన్నారు .
మెడలు, తొడలు రుద్దుకుంటే జనం నమ్మరు...
మైక్ పట్టుకుని ఊగిపోతూ తొడ , మెడను రుద్దుకుంటే నమ్మేయడానికి ప్రజలు పిచ్చోళ్ళేమీ కాదని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబుకు ఆపద కల్గించారని తెలిస్తే వెంటనే అక్కడకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతారన్నారు . మేమైనా మాట్లాడితే బూతులు తిడుతున్నట్టుగా చిత్రీకరిస్తున్నాడన్నారు . సీఎం జగన్మోహనరెడ్డిని ఒక మాట అంటే మేము పది మాటలు అంటామన్నారు . బూతుల మంత్రనో , ఇంకేమైనా అనుకోవచ్చని , డోంట్ కేర్ అని అన్నారు. జగన్మోహనరెడ్డి పై ఈగ వాలితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలంతా దేనికైనా సిద్ధంగా ఉంటారన్నారు.
దమ్ముంటే చొక్కా పట్టుకో..
పవన్ కళ్యాణ్ వచ్చి మాకు వార్నింగ్ లివ్వడమేంటో అర్ధం కావడం లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో ఆయన కలిసినా మాకేమీ కాదన్నారు. పదేపదే చొక్కా పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడని , దమ్ముంటే మా చొక్కా పట్టుకోమని సవాల్ విసిరారు .ఇదేమైనా సినిమానా, పవన్ కళ్యాణ్ తంతే పది మంది పడిపోవడానికి అని ఎద్దేవా చేశారు. పార్టనర్ చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసి ఇస్తే దాన్ని పట్టుకొచ్చి చదవడమే పవన్ కళ్యాణ్ పని అని , ప్రజలు ఆయనను పిచ్చోడని అనుకుంటారని కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్యాకేజీలు తీసుకోవడం అలవాటుగా మారిందన్నారు.
రాష్ట్ర బడ్జెట్ తెలుసుకో ముందు
రైతులకు రూ . 35 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని పవన్ అంటున్నాడని , 87 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే రూ .3.50 లక్షల కోట్లు అవుతాయని మంత్రి కొడాలి గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్ , ఆదాయం ఎంత అనేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలు పోను ఎంత మిగులుతుందనేది ముందు తెలుసుకోవాలన్నారు . ఢిల్లీలో ఆయన నరేంద్రమోదీ సంక నాకుతుంటాడన్నారు . పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అప్పోసప్పో చేసి రూ . 3.50 లక్షల కోట్లు ఇస్తామని , కేంద్ర ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ ఎంత పట్టుకొస్తాడో చెప్పమంటే అది కూడా మమ్మల్ని అడుక్కోమని అంటున్నాడన్నారు .
చంద్రబాబుకూ మాకు తేడా ఇదే...
తనకు మాత్రం ఏం వచ్చిందో తప్ప రైతులకు ఏం చేశామనేది పవన్ కళ్యాణ్ కు పట్టదని మంత్రి కొడాలి నాని అన్నారు . చంద్రబాబు హయాంలో రూ .87 వేల కోట్లు రైతుల రుణాలను రద్దు చేస్తానని చెప్పారని , పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారని , ఆ తర్వాత అధికారంలోకి వచ్చినపుడు రుణాలను రద్దు చేయలేదని ఎందుకు చొక్కా పట్టుకోలేదో చెప్పాలన్నారు . చంద్రబాబు గతంలో చేసిన మోసం వల్లే రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారన్నారు . నివర్ తుఫాను బాధిత రైతులకు నెల రోజుల్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందజేశామన్నారు . తినడానికి పనికిరాని బియ్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు . వచ్చే నెల్లో ఇవ్వాల్సిన మూడవ విడత రైతు భరోసాను నెల రోజుల ముందే ఇచ్చామని మంత్రి కొడాలి నాని చెప్పారు.