నిమ్మగడ్డపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు- చిల్లర రాజకీయాల్ని చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టినందున స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గనందున ఇప్పుడే ఎన్నికలేంటంటూ సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాయడం, తన విధుల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆయన కౌంటర్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే క్రమంలో నిమ్మగడ్డ తీరుపై మంత్రి కొడాలి నాని ఇవాళ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో స్ధానిక సంస్ధళ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్ధలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గు చేటన్నారు. కరోనా దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్ధలు, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్ధలో ఉన్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యేలోపు హుందాగా వ్యవహరించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని కొడాలి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కు వయసు వచ్చినా బుద్ధీ, జ్ఞానం లేకుండా కరోనా కేసులు తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ, జూమ్ బాబు (చంద్రబాబు) కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.