దేవుడిలాంటి ఎన్టీఆర్కే వెన్నుపోటు: ఆ పనిలో లోకేష్: రామతీర్థం వెనుక ఆ ముగ్గురు: కొడాలి నాని
విజయవాడ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రామతీర్థం క్షేత్రాన్ని పర్యటించిన సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ పెద్దల నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. అది మరింత ఉధృతి దాల్చింది.
కొడాలి నాని ఫైర్..
ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ (మున్సిపాలిటీలు), మేకతోటి సుచరిత (హోం), వెల్లంపల్లి (దేవాదాయం) టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయగా.. తాజాగా అదే జాబితాలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేరారు. తనదైన శైలిలో ఆయన నారా లోకేష్పై విరుచుకుపడ్డారు. నారా లోకేష్ను కొడాలినాని.. బఫూన్తో పోల్చారు. రామతీర్థం ఉదంతానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ నేతలేనని, త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతానని హెచ్చరించారు.
కుట్రలో ఆ ముగ్గురి హస్తం..
రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబేని కొడాలి నాని ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబుతో పాటు, ఆయన కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేత, ఉద్వాసనకు గురైన రామతీర్థం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఉన్నారని విమర్శించారు. ఆలయ ధర్మకర్తగా ఉంటోన్న అశోక్ గజపతిరాజుకు తెలియకుండా ఇదంతా చోటు చేసుకుని ఉండకపోవచ్చనే అనుమానాలను కొడాలి నాని లేవనెత్తారు.
నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలంటూ
నెల్లిమర్ల, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయిస్తే.. మొత్తం బండారం బయటపడుతుందని అన్నారు. దేవుడిలాంటి ఎన్టీఆర్కే చంద్రబాబుకు,వెన్నుపోటు పొడిచారని, ఇక దేవుడి పట్ల ఏ విశ్వాసం ఉంటుందని ప్రశ్నించారు. దేవుడిపైనే కాదు.. చంద్రబాబుకు తనపై తనకే నమ్మకం లేదని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు ‘డేరా బాబా' అవతారం ఎత్తారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకునే దుర్మార్గం..
రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని ధ్వజమెత్తారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలెంజ్ విసరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాత, తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్లే నారా లోకేష్ దొడ్డి దారిన మూడు శాఖలకు మంత్రిగా పనిచేశారని, లేదంటే ఆయనను ఎవరూ కనీసం గుర్తించరని చెప్పారు.
నారా లోకేష్ సవాల్ను వైఎస్ జగన్ స్వీకరించాలా?
ఏరికోరి ఎంచుకున్న మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్కు, తనలాంటి 151 మంది ఎమ్మెల్యేలను ఒంటిచేత్తో గెలిపించుకున్న వైఎస్ జగన్కు భూమి, ఆకాశం అంత తేడా ఉందని అన్నారు.నారా లోకేష్కు తినడం, తిరగడం, పడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని చురకలు అంటించారు. ప్రజలు ఛీకొట్టిన ఓ బఫూన్ అని, రాజకీయాల్లో ఆయన ఓ జోకర్తో సమానం అని అన్నారు. లోకేష్ తన పిచ్చివాగుడును కట్టి పెట్టకపోతే తాము సహించోమని, ఆయన మూతిపళ్లు రాలిపోయేలా కొడతామని హెచ్చరించారు.