మోడీ పారిపోయి నాటకాలు:మంత్రి కొల్లు;దళితులకు రక్షణ కరువు:వర్ల రామయ్య
కృష్ణా జిల్లా: పార్లమెంటు నడపడంలో,సమస్యలు చర్చించడంలో కేంద్రప్రభుత్వం దారుణంగా విఫలమైందని...అందుకే ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటునుంచి పారిపోయారని యువజన సర్వీసులు, క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోడీ సభను జరిపించకుండా పారిపోయి ఇప్పుడు దొంగ దీక్షలతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. బిజెపి, వైయస్ఆర్సిపి ,జనసేన రహస్య ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని మంత్రి కొల్లు ఆరోపించారు. అసలు వైయస్ఆర్సిపి ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారో...ఆ తరువాత మళ్లీ దీక్షలు ఎందుకు చేస్తున్నారో వారికే అర్ధంకావడంలేదని మంత్రి కొల్లు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ వైసిపి ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి కోసం కాకుండా అభివృధ్ధిని అడ్డుకునేందుకు బిజెపితో చేతులు కలిపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
మరోవైపు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. మోదీ, అమిత్ షా నిరసనలు ఎందుకో చెప్పాలన్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే.. బాగోతం బయటపడుతుందనే బీజేపీ పారిపోయిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులకు రక్షణ లేకుండాపోయిందన్నారు.