సదావర్తిపై మాణిక్యాల రావు ఇలా: ‘ఐలయ్య సారీ చెప్పాల్సిందే’
సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు.
విజయవాడ: సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆ తీర్పు వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లు రూ.1300 కోట్లు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వేలంలో పాల్గొనకపోతే రూ.15 కోట్లు జప్తు చేస్తామని రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇది ఇలావుంటే.. త్వరలో 'గుండె గుండెకి బీజేపీ' నినాదంతో ప్రజల్లోకి వెళతామని మాణిక్యాలరావు తెలిపారు. ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆచార్య కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై మాణిక్యాలరావు స్పందించారు.
ఆర్యవైశ్యులకు కంచ ఐలయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. ఒక కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని కోరుతున్నట్లు చెప్పారు.