కుప్పం నియోజకవర్గంలో...కక్ష సాధింపు రాజకీయం:నారా లోకేష్
చిత్తూరు:సిఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో స్థానిక నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకూ కుప్పం నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా కక్ష సాధింపు రాజకీయం చేశారని ఆరోపించారు. తాము ఈ నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడి పార్టీ నాయకులు అంతా సమన్వయంతో పని చెయ్యాలని సూచించారు.
గ్రూపు రాజకీయాలకు స్వస్థి చెప్పి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని...ప్రజా సమస్యల పరిష్కారంపైనే నేతలందరూ తమ దృష్టిపెట్టాలని లోకేష్ హితవు పలికారు. కార్యకర్తలే తెలుగు దేశం పార్టీకి వెన్నెముక అని...నేతలంతా కార్యకర్తలకు అండగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం విచ్చేసిన నేపథ్యంలో శుక్రవారంతో లోకేష్ పర్యటన ముగియనుంది.
తొలిరోజు పర్యటనలో రాళ్ళ బూదుగురు గ్రామంలో మంత్రి నారా లోకేష్ ప్రజలను ఊదేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 2014 నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.228 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.ఈ నియోజకవర్గంలో 5 వేలు జనాభా కలిగిన గ్రామ పంచాయితీ లలో అండర్ డ్రైనేజీ పనులను 3 నెలలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గం పరిధిలో రోడ్లు అభివృద్ధికి రూ.80 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు దీనికోసం ఇప్పటికే 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో 3600 గృహాలు మంజూరు చేయగా, 2వేలు గృహాలు మాత్రమే పూర్తి అయ్యాయని, మిగిలినవి కూడా వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 68 సంవత్సరాల వయసు లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీరిక లేకుండా కష్ట పడుతున్నారని, ఆయనకు మనందరం సహాయసాహకారాలు అందించాలని కోరారు.