నీ పక్కనే ఉన్నారు, ఆంధ్రా ఓటర్లు లేకుండానే గెలిచారా?: కేసీఆర్పై లోకేష్
అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. ఆంధ్రా ఓట్లు లేకుండానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస గెలిచిందా అని ప్రశ్నించారు. తెలుగు వాళ్లు అంతా ఒక్కటేనని చెబుతూనే మళ్లీ జాగో.. బాగో అని కేసీఆర్ అంటున్నారని చెప్పారు. ఆంధ్రా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ రానున్నారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు, పొత్తులపై తెలంగాణ టీడీపీ నేతలతో చర్చించనున్నారు. శనివారం మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చర్చించనున్నారు.
సిగ్గుండాలి, చక్రం తిప్పుతాడట: చంద్రబాబుపై కేసీఆర్ ఘాటుగా, డీఎస్ పైనా
చంద్రబాబును కేసీఆర్ ఏమన్నారంటే?
కాగా, గురువారం కేసీఆర్ మాట్లాడుతూ... చంద్రబాబుకు చురకలు అంటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తుపై ప్రచారం సాగుతోంది. దీనిపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. పొద్దున లేస్తే చంద్రబాబు మాపై అబద్దాలు ఆడుతారని, మనలను టార్గెట్ చేస్తారని, అలాంటి కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తా.. సిగ్గుండాలి అని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈ కాంగ్రెస్ వాళ్లు ఆంధ్రా పార్టీని తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ ఆంధ్రా పార్టీకి గులాం కావొద్దన్నారు. తెలంగాణకు తెలంగాణ వాళ్లే శాసనకర్తలు కావాలన్నారు. ఇంకా మాట్లాడుతూ.. తమది ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ (జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్) అన్నారు. పక్క రాష్ట్రం అతనే నేను 25 స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానని అన్నారని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కసరత్తు
శాసన భ రద్దు నేపథ్యంలో తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ గురువారం నుంచే కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలతో గురువారం రాత్రి ఏపీ సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణలో సీపీఐ, కోదండరాం పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయని తెలిపారు. సిపిఎం కూడా కలిసి వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆలోచించాలని ఏపీ మంత్రులు, ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు.
వారితో చర్చలు
బీజేపీని, కేసీఆర్ను వ్యతిరేకించే వారితో కలిసి పని చేద్దామని ఆ భేటీలో చర్చించారు. తెలంగాణ టీడీపీ నేతలతో శనివారం హైదరాబాదులో సమావేశమవుతున్నామని, దానికి ముందే, తెలంగాణ టీడీపీ నాయకులు సీపీఎం, సీపీఐ నాయకులతో, కోదండరాంతో చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. చంద్రబాబుతో శనివారంభేటీ అనంతరం ఓ స్పష్టత రానుందని తెలుస్తోంది.
టీడీపీ తెలంగాణ శత్రువుగా చిత్రీకరిస్తున్నారని
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్, పవన్ కళ్యాణ్లు ప్రధాని మోడీ కనుసన్నుల్లో మెదులుతున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ సభ రద్దు, గవర్నర్ వెంటనే ఆమోదం తెలపడం, ఆయనను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని చెప్పడం.. చూస్తుంటే కేంద్రం వ్యూహంలో భాగమే అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీకి బలమైన పునాది ఉందని, టీడీపీని తెలంగాణకు శత్రువుగా చూపించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారన్నారు. దానిని తిప్పికొట్టాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు.