5లక్షలా?.. అలా ఒక్కరిని చూపించండి: మంత్రి లోకేష్కు చేదు అనుభవం
లేని ఉద్యోగాల పేరు చెప్పి 5లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పడమేంటని జనం ఆయన్ను నిలదీశారు.
కర్నూలు: ఏపీ మంత్రి లోకేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. లేని ఉద్యోగాల పేరు చెప్పి 5లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పడమేంటని జనం ఆయన్ను నిలదీశారు. మధ్యలో పార్టీ నేతలు కలగజేసుకుని వారిని అడ్డుకోవడంతో వారి కోపం మరింత రెట్టింపయ్యింది.
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభలో ప్రసంగించడానికి వచ్చిన లోకేష్.. రాయలసీమలో ఉపాధి అవకాశాల గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాయలసీమకు భారీగా పరిశ్రమలు తరలొచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు, కియా మోటార్స్ కంపెనీ ఏర్పాటుతో దాదాపు 5లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.
లోకేష్ ఈ మాట చెబుతున్న సమయంలో సభలో ఉన్న కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 5లక్షల ఉద్యోగాలు వచ్చాయంటున్నారు కాబట్టి.. వారిలో ఒక్కరినైనా చూపించండంటూ లోకేష్ ను ప్రశ్నించారు. మధ్యలో టీడీపీ నాయకులు వారిని అడ్డుకోవడంతో వారు మరింత కోపోద్రిక్తులయ్యారు.
మీ నాయకుడి ముందు మీరెలాగు మాట్లాడలేరు కాబట్టి తమనైనా మాట్లాడనివ్వాలని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అడ్డుకోవాలని చూడటమేంటని నిలదీశారు. స్థానికులు ఎదురుతిరగడంతో లోకేష్ కంగుతిన్నట్లు సమాచారం.