లీటరు నీరు, కేజీ మట్టి: రాజధాని కోసం సంకల్ప జ్యోతి యాత్ర
అమరావతి: సంకల్ప జ్యోతిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంఫ్ ఆఫీసులో సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు.
రాజధాని నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఇందు కోసం అమరావతి సంకల్ప జ్యోతి యాత్రను చేపట్టామన్నారు. ఈ నెల 21వ తేదీన రాజధానిలో శంకుస్థాపన జరిగే స్థలానికి ఈ సంకల్ప జ్యోతి యాత్ర చేరుకుంటుందని తెలిపారు.
దీంతో పాటు రాజధాని శంకుస్థాపనకు 'అమరావతి మన మట్టి-మన నీరు' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా ఒక లీటరు నీరు, ఒక కేజీ మట్టిని తమ వంతు బాధ్యతగా రాజధాని నిర్మాణానికి అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఈనెల 15 నుంచి మొదలై 18వ తేదీకి గుంటూరు చేరుతుందన్నారు. గుంటూరు నుంచి 19వ తేదీన శంకుస్థాపన జరిగే ప్రాంతానికి ఈ మట్టిని, నీటిని తీసుకుపోయేలా ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామాల నుంచి మండలాలకు నీటిని కలశాల్లో, మట్టిని సంచుల్లోతెచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. మండలాలకు చేరుకున్న మట్టిని అన్ని జిల్లా కేంద్రాలకు చేరుస్తామన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ నెల 13 నుంచి 21 వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామన్నారు.