కరోనా పేషెంట్లతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్: విజ్ఙప్తులు.. ఫిర్యాదులు..!
నెల్లూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే.. 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఇదివరకు రోజూ 80కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఈ సంఖ్య తాజాగా 60కి తగ్గింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 60కి చేరగా.. మొత్తం మీద ఇప్పటిదాకా ఉన్న పాజిటివ్ కేసులు 1463కు చేరుకున్నాయి. 403 మంది డిశ్చార్జి అయ్యారు.
Recommended Video
ఏపీ నయా రికార్డు: లక్ష దాటిన కరోనా టెస్టింగులు: కొత్తగా 60 పాజిటివ్ కేసులు: ఇద్దరి మృతి
ఒకవంక కేసులు పెరుగుతున్నప్పటికీ.. మరోవంక డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య కూడా దాదాపు అదే స్థాయిలో నమోదవుతుండటం పట్ల ప్రభుత్వం పెద్దలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య చికిత్సను, పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య మరింత పెంచడానికి తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా- జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ శుక్రవారం ఉదయం కరోనా పేషెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని తన అధికారిక నివాసం నుంచి ఆయన కరోనా పేషెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు. వారికి అందుతోన్న వైద్య చికిత్స, ఆహారం, మందుల గురించి అనిల్ కుమార్ యాదవ్ ఆరా తీశారు.
కరోనా వైరస్ ప్రమాదకరమేమీ కాదని, ఇప్పటిదాకా 403 మంది పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లారని మంత్రి వారికి ధైర్యం చెప్పారు. పేషెంట్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నారు. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన మొట్టమొదటి కరోనా వైరస్ పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిశ్చార్జి అయ్యే పేషెంట్లకు రెండు వేల రూపాయలను అందజేస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు పేషెంట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు. వార్డులో అందుతోన్న సౌకర్యాలు, ఆహారం, మందుల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కొందరు ఫిర్యాదు చేయగా.. తమను త్వరగా డిశ్చార్జి చేయాలని మరి కొందరు మంత్రికి విజ్ఙప్తి చేశారు. డాక్టర్లు సకాలంలో వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. సమయానికి పౌష్టికాహారం అందుతోందని చెప్పారు.