తెలుగు రాష్ట్రాలపై మొయిలీ వ్యాఖ్య దుమారం, అన్లేదని వివరణ
హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చేశారని చెబుతున్న వ్యాఖ్యల పైన దుమారం రేగుతోంది. తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలకు సంబంధించి మొయిలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. దీనిపైన పలువురు మండిపడుతున్నారు.
మొయిలీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలకు పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా పని చేసి, విభజన సమయంలో ప్రధాన పాత్ర వహించిన మొయిలీ అలా వ్యాఖ్యానించడం ఏమాత్రం సరికాదన్నారు. మొయిలీని తెలుగు ప్రజలు, చరిత్ర క్షమించదన్నారు. తన వ్యాఖ్యల పైన వీరప్ప మొయిలీ కూడా స్పందించారు.
తన పైన వచ్చిన కథనాలను వీరప్ప మొయిలీ ఖండించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని తాను వ్యాఖ్యానించలేదన్నారు.