మీకు బాధేందుకు: జగన్పై పరిటాల సునీత, విషప్రచారమన్న ద్వారంపూడి
హైదరాబాద్/తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. రైతు రుణమాఫీపై వైయస్ జగన్ ఆధ్వర్యంలో ఏపి వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనల నిర్వహించిన నేపథ్యంలో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కెఈ కృష్ణమూర్తి తదితర మంత్రులు ఇప్పటికే జగన్పై మండిపడ్డారు. ఇప్పుడు మరో మంత్రి పరిటాల సునీత కూడా జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ప్రకటించిన రుణమాఫీతో రైతులు సంతోషంగానే ఉన్నారని.. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే రుణమాఫీపై ప్రకటన చేస్తే స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం జగన్కు సరికాదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని పరిటాల సునీత సూచించారు.
ఇది ఇలా ఉండగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు చేపడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. వ్యవసాయం రుణం అంటే పంట రుణమని జగన్మోహన్మోహన్ రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ పంచిపెడతాం: ద్వారంపూడి
తూర్పుగోదావరి: ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీపై మాటతప్పారని వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. కాకినాడలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీపై తొలి సంతకానికి విలువ లేకుండా చేశారని విమర్శించారు. తొలి సంతకం చేసి మాట నిలుపుకున్న నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకే మహాధర్నా చేపట్టామని తెలిపారు. టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికి పంచిపెడతామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను టిడిపి ప్రభుత్వం అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రుణమాఫీపై చంద్రబాబు తోక పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.