ఏపీ మంత్రి పేర్నినానిని స్వల్ప అస్వస్ధత- అనుచరుడి అంతిమయాత్రలో...
ఎప్పుడూ చలాకీగా కనిపించే ఏపీ సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇవాళ అస్వస్ధతకు గురయ్యారు. తన నియోజకవర్గం మచిలీపట్నంలో అనుచరుడు భాస్కరరావును నిన్న ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. ఇవాళ అంత్యక్రియల్లో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే అనుచరులు ఆయనకు ప్రాదమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు.
నిన్న అనుచరుడు భాస్కరరావు హత్య తర్వాత తీవ్ర డిప్రెషన్ కు గురైన నాని, ఇవాళ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేదు. దీంతో ఆయన డీహైడ్రేషన్ కు గురై సృహతప్పినట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మచిలీపట్నంలోని స్మశాన వాటికకు వెళ్లిన నాని.. అక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే అనుచరులు పక్కకు తీసుకెళ్లి ఆయనకు మంచినీరు ఇచ్చారు.
కాసేపటి తర్వాత ఆయనకు ప్రాధమిక చికిత్స అందించారు. నానికి అస్వస్దత వార్త తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.