జగన్! తెలుసుకో: ఈనాడు పత్రికపై ఏపీ మంత్రి ప్రశంస
హైదరాబాద్: ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు మంగళవారం శాసన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి.. మీ పత్రికను ఎవరు ఏమీ అనరనే ఎప్పుడూ ఈనాడు గురించి మాట్లాడుతూ గెజిట్ అంటున్నారని, నిష్పక్షపాతంగా రాసేది ఈనాడు పత్రికే అన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో ఈనాడులో బాగా ఇచ్చారన్నారు. అది విలువలు కలిగిన పత్రిక అన్నారు. మంచీ చెడూ అన్నీ రాస్తారన్నారు. ఈనాడు ఎప్పుడూ వార్తను వార్తగానే చెబుతుందని తెలుసుకోవాలని హితవు పలికారు. విద్యుత్ పైన చర్చ జరుగుతున్న సమయంలో కామినేని మాట్లాడారు. ప్రతి అంశాన్ని జగన్ రాజకీయం చేయడం జగన్కు తగదన్నారు.
ఏపీ శాసనసభలో వైసీపీ ఆందోళన
ఏపీ శాసనసభలో వాయిదా పర్వం కొనసాగుతోంది. బుధవారం సభ మొదలైని వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనలతో వెంటనే వాయిదా పడింది. భూసమీకరణ, రాజధాని నిర్మాణంపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. సభలో విపక్ష సభ్యుల వైఖరిపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సభ ఇంకా మూడు రోజులే ఉందని, ఇంకా చాలా అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. అందుకు విపక్ష సభ్యులు సహకరించాలన్నారు. విపక్షం సభకు అడ్డుకుంటోందని, సభా సమయాన్ని వృథా చేస్తోందని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
సభ నియమ నిబంధనలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరోసారి క్లాసులు నిర్వహించాలని సూచించారు. సభా సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. కావాలనే ప్రతిపక్షం రచ్చ చేస్తోందని మండిపడ్డారు. ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.