లేడీ టీచర్ వేధింపుల కేసు: ఫేస్బుక్లో మంత్రి రావెల తనయుడి వివరణ ఇదీ
హైదరాబాద్: మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ఎట్టకేలకు వివరణ ఇచ్చాడు. ఈ మేరకు అతని ఫేస్బుక్లోని తన పేజీలో ఘటనకు సంబంధించి శుక్రవారం రాత్రి పొద్దుపొయిన తర్వాత పూర్తి స్థాయిలో తన వివరణను పోస్ట్ చేశాడు.
ఆ వివరణ ప్రకారం నిన్న మధ్యాహ్నం రోడ్డుపై వెళుతున్న సుశీల్ కారుకు ఓ కుక్కపిల్ల అడ్డంగా వచ్చింది. రోడ్డు దాటే క్రమంలో ఆ కుక్కపిల్ల రాగా, దానిని గమనించిన సుశీల్ కారు ఆపేశాడు. వెనువెంటనే కారు దిగి కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. ఈలోగా ఓ మహిళ వచ్చి తనను తిట్టిందన్నారు.
దీనిని గమనించిన అక్కడి స్థానికులు వారి చుట్టూ మూగారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న మహిళ తనపై అసత్య ఆరోపణలు గుప్పించిందని సుశీల్ ఆరోపించాడు. ఈ క్రమంలో తాను స్పందించేలోపే కొంతమంది గుమిగూడి కొట్టారని ఆయన ఆరోపించారు.
అయితే ఈ వివాదం ఆ వెంటనే ముగిసింది. బాధిత మహిళతో మాట్లాడి వివాదాన్ని శుక్రవారం మధ్యాహ్నానికే సుశీల్ పరిష్కరించుకున్నాడు. అయినా సాయంత్రం దాకా మీడియాలో దీనిపై అసత్య కథనాలు ప్రచురితమవుతున్నాయని సుశీల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని రావెల సుశీల్ ఆరోపించారు. తనపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్నారని, నిన్న మధ్యాహ్నమే ఆ ఘటన పరిష్కారమైందని, కొంతమంది కావాలనే పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని రావెల సుశీల్ ఆరోపించారు.
Dear friends, I m here to tell you the actual truth.The events which are being portrayed in the news channels are...
Posted by Ravela Susheel on Friday, March 4, 2016
ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని సుశీల్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మరోవైపు రావెల సుశీల్ను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని అతడి చేతిలో వేధింపులకు గురైన బాధితురాలు, ఆమె తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదు, జూబ్లీహిల్స్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న సుశీల్ అటుగా వెళుతున్న మహిళను చేయి పట్టి లాగాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుశీల్ వివరాలు తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా, కారు డ్రైవర్ అప్పారావుపై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలు స్వయంగా సుశీల్పై ఫిర్యాదు చేశారు. తనపై వేధింపులకు దిగిన సుశీల్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు తనపై జరిగిన వేధింపుల పర్వాన్ని ఆమె సవివరంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని ప్రకటించిన పోలీసులు, నిందితుడిని రావెల సుశీల్గా గుర్తించామని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదులో ప్రస్తావించిన పేర్లను ఎఫ్ఐఆర్లో తప్పక చేరుస్తామని చెప్పిన పోలీసులు, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ప్రకటించారు.