గన్తో సెల్పీకి కొడుకు యత్నం: బుల్లెట్ దూసుకెళ్లి కానిస్టేబుల్ మృతి
కడప: నగరంలోని రాజారెడ్డి వీధిలో గురువారం తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, కానిస్టేబుల్ మృతిపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో అతడ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా చంద్రశేఖర్ రెడ్డి మరణించారు.
చంద్రశేఖర్ రెడ్డి తుపాకీ మిస్ అయిన కేసులో మరో వాదన కూడా వినిపిస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి తుపాకీ శుభ్రం చేస్తుండగా.. సెల్ఫీ తీసుకునేందుకు ఆయన కొడుకు ఆ తుపాకీని తీసుకున్నాడు. అతడు సెల్ఫీ తీసుకునే క్రమంలోనే మిస్ ఫైర్ అయి బుల్టెట్ చంద్రశేఖర్ రెడ్డి శరీరంలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.
అయితే, పోలీసులు మాత్రం తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలోనే మిస్ ఫైర్ చంద్రశేఖర్ రెడ్డి చనిపోయారని స్పష్టం చేశారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరిన చంద్రశేఖర్ రెడ్డి అమూల్యమైన సేవలందించారని జిల్లా ఎస్పీ చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆయన చనిపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా, చంద్రశేఖర్రెడ్డి గతంలో మంత్రి ఆదినారాయణరెడ్డి వద్ద గన్మెన్గా పనిచేశాడు.