తెలంగాణ ఉన్నంతకాలం టీడీపీ ఉంటుంది:మంత్రి సోమిరెడ్డి;రాష్ట్రంలో పొత్తుల గురించి ఆలోచన లేదు:రఘువీరా
అమరావతి:తెలంగాణ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తేల్చిచెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాశ, నిస్పృహలతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మంత్రి సోమిరెడ్డి దుయ్యబట్టారు.
గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కు ఎన్నికల భయం పట్టుకుందన్నారు. చంద్రబాబుపై కెసిఆర్ చేసే విమర్శలను ప్రజలు హర్షించరని...అలాంటి వ్యాఖ్యల వల్ల కేసీఆర్కు నష్టమే తప్ప లాభం ఉండదని మంత్రి సోమిరెడ్డి స్పష్టంచేశారు. ప్రధాని మోడీ నుంచి కేసీఆర్ వరకు చంద్రబాబును చూసి భయపడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గతంలో అన్నారని...ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని మంత్రి సోమిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీ లేదని కెసిఆర్ అన్నారని, మరెందుకు భయపడుతున్నారని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లను దూషిస్తేనే ఓట్లు పడతాయని అనుకోవడం మంచిదికాదని కెసిఆర్ కు మంత్రి సోమిరెడ్డి హితవు పలికారు.
2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని ఆయన కెసిఆర్ ను నిలదీశారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు అని...అలాంటి ఆయనను తెలంగాణను నాశనం చేశారని అనడం చాలా బాధాకరమన్నారు. రూ.500 కోట్లు కాదు రూ.5 కోట్లు కూడా తెలంగాణకు పంపాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. కేసీఆర్కు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి సోమిరెడ్డి జోస్యం చెప్పారు.
మరోవైపు కడపలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎపిలో పొత్తుల గురించి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. బీజేపీ తీరని ద్రోహం చేసిందని... రైతులను నమ్మించి గొంతు కోసిందని రఘువీరా దుయ్యబట్టారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజునే బిజెపి హింసను ప్రోత్సహించిందని వ్యాఖ్యనించారు. బిజెపి జై జవాన్-జై కిసాన్ అనే నినాదం వదిలేసి...జై జపాన్ జై కార్పొరేట్ అని అంటోందని రఘువీరా ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వం పాలనే మేలనిపిస్తోందన్నారు. జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ టాక్స్ కాదని...గబ్బర్ సింగ్ టాక్స్ అని రఘువీరా రెడ్డి అభివర్ణించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు దేశవ్యాప్తంగా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని రఘువీరా పునరుద్ఘాటించారు.