సీబీఐలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?...అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు హాస్యాస్పదం:మంత్రి యనమల
అమరావతి:సీబీఐ నిష్పక్షపాత వైఖరి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.
సిబిఐ వ్యవహారం గురించి జైట్లీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ సీబీఐలో ఇలాంటి గొడవలు లేవన్నారు. మోదీ పాలనలో వ్యవస్థల పతనానికి సీబీఐ ఉదంతమే తాజా నిదర్శనమని యనమల వ్యాఖ్యానించారు. సీబీఐపై ఆరోపణలు ప్రధాని మోడీ అసమర్ధ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
జైట్లీ వ్యాఖ్యలు...యనమల స్పందన
సిబిఐలో అంతర్గత పోరు గురించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. అసలు సిబిఐ, ఈడి, ఐటి లాంటి సంస్థల ప్రతిష్టను కేంద్రం దిగజార్చిందని యనమల దుయ్యబట్టారు. సీబీఐలో డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు చేసుకోడం ఎప్పుడైనా విన్నామా?...అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పడే...ఎందుకు ఇలా?
అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కన్నీరు పెట్టడం గతంలో ఎప్పుడైనా చూశామా?...ఇవన్నీ ఈ పాలనలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాఫెల్ స్కామ్పై జెపిసికి కేంద్రం ఎందుకు వెనుకంజ వేస్తుందని యనమల నిలదీశారు. ఈడీ జప్తు చేసిన జగన్ ఆస్తులను వెనక్కి తీసుకోవడం జరిగిందని, అప్పుడే మీ నిష్పాక్షిత ఏ పాటిదో వెల్లడైందని యనమల ఎద్దేవా చేశారు.
భగ్గుమన్న...ప్రతిపక్షాలు
మరోవైపు సిబిఐ డైరెక్టర్ పదవిని వదులుకోవాలని అలోక్ వర్మకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.దీంతో ఈ విషయమై బుధవారం రక్షణ శాఖ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్యాప్తు సంస్థ సమగ్రతను, విశ్వసనీయతను పరిరక్షించడానికే అర్థరాత్రి ఆదేశాలు చేశామని రక్షణ శాఖ పేర్కొంది.
అందుకే...ఈ నిర్ణయం
ఇక సిబిఐలో అంతర్గత పోరు గురించి కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారమే కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులు ఒకరినికొకరు విచారణ చేయలేరని, సిట్ వారి కింద పనిచేయడం లేదని, ఈ విషయాన్ని దర్యాప్తు చేపట్టనున్నట్లు జైట్లీ తెలిపారు. దర్యాప్తు సంస్థ అధికారులు పరిహాసం అవుతున్నట్లుగా సిబిఐ అవ్వకూడదన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారులు నిరపరాదులైతే వారు తిరిగి వస్తారని జైట్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.