కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో కొరవడిన స్పష్టత- ప్రజల్లో పెరుగుతున్న కన్ఫ్యూజన్
కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో స్పష్టత కొరవడుతోంది. తాజాగా ఎన్.పి.ఆర్ అమలును నిలిపివేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన ఎన్.పి.ఆర్ ప్రశ్నావళిలో ముస్లింలకు అభ్యంతరాలు ఉన్నందున దాన్ని అమలు చేయడం లేదని ప్రకటించింది. అయితే పార్లమెంటులో సీఏఏకు ఎందుకు మద్దతిచ్చారో, ఎన్.పి.ఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేని పరిస్ధితి నెలకొంది.
ఎన్.పి.ఆర్ అమలుపై స్పష్టత లేని మంత్రులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై కేబినెట్ మంత్రులకే స్పష్టత లేని పరిస్ధితి నెలకొంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ముస్లిం వర్గాల్లో సీఏఏ, ఎన్సార్సీ, ఎన్.పి.ఆర్ అమలు విషయంలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందా లేదా అన్న అంశాల్ని పక్కనబెడితే గందరగోళానికి తెరతీస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం పార్లమెంటులో సీఏఏకు మద్దతుగా వైసీపీ ఎంపీలు బేషరతుగా మద్దతునివ్వగా, తాజాగా ఎన్.పి.ఆర్ అమలు చేయబోమంటూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడమే.
సీఏఏ సై.. ఎన్.పి.ఆర్ కు నై
గతంలో పార్లమెంటులో సీఏఏకు ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో ప్రస్తుతం ఎన్.పి.ఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మంత్రులకూ స్పష్టత లేదు. కేబినెట్ సమావేశంలో ముస్లింలలో నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఎన్.పి.ఆర్ అమలును పక్కనబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంపై సమావేశంలో ఒక్క మంత్రి కూడా ప్రశ్నించలేదు. గతంలో సీఏఏకు మద్దతిచ్చి ఇప్పుడు ఎన్.పి.ఆర్ ను వ్యతిరేకిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్న విషయాన్ని ఏ ఒక్క మంత్రీ పట్టించుకోలేదు.
ఎన్.పి.ఆర్ ను వ్యతిరేకించే అధికారముందా
వాస్తవానికి జాతీయ జనగణనకు ఉద్దేశించిన ఎన్.పి.ఆర్ ను వ్యతిరేకించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటే ఉందనే సమాధానం మంత్రుల వద్ద నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో జనగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సెన్సన్ కమిషనర్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. కేవలం సెన్సస్ కమిషనర్ కు సిబ్బంది, సౌకర్యాలను సమకూర్చడం తప్ప. కానీ కేంద్రం చేతిలో ఉన్న అంశంపై తమకు అధికారం ఉందంటూ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీంతో అసలు ఎన్.పి.ఆర్ ను వైసీపీ సర్కారు ఆపగలదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.