రామతీర్థానికి మంత్రులు.. స్వయంగా పరిశీలన, టెన్షన్.. టెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న రామస్వామి ఆలయం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల ఇక్కడి రాముల వారి విగ్రహం తలను ఖండించిన దుండగులు కోనేరులో పడేయడంతో మొదలైన జ్వాలలు పార్టీలకు అతీతంగా రాజుకున్నాయి. విపక్షాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. మంత్రులపైనా విమర్శలు చేశాయి. ఆదివారం రామతీర్థం వెళ్లాలని ఇద్దరు వైసీపీ మంత్రులు నిర్ణయించుకున్నారు.
నిత్యం రామనామ స్మరణతో మార్మోగే రామతీర్థం పుణ్యక్షేత్రం పరిసరాలు శనివారం రాజకీయ పార్టీల నినాదాలు వినిపించాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం రామతీర్థంలో బోడికొండపై ఉన్న రామస్వామి ఆలయానికి వెళ్లి అక్కడి ఘటన స్థలాన్ని పరిశీలిస్తారు. శనివారం రాత్రే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విశాఖ బయల్దేరారు. ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత ఆయన రామతీర్థం వెళతారు. బొత్స కూడా అదే సమయంలో విజయనగరం నుంచి రామతీర్థానికి వెళతారు. అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.