ఏపీలో నో, హైదరాబాద్ ఓకే.. కరోనా వైద్యం కోసం మంత్రుల బాట, సీపీఐ రామకృష్ణ లేఖాస్త్రం
కరోనా మహమ్మరితో జనం బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యులు అయితే చిన్న, చితక ఆస్పత్రిలో చేరతారు. మరీ ప్రజా ప్రతినిధులు అయితే అన్నీ సౌకర్యాలు ఉంటేనే ఓకే.. లేదంటే లేదు. ఆంధ్రప్రదేశ్కి చెందిన నేతలు అక్కడ కాకుండా పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకునేందుకు వస్తున్నారు. దీనిని సీపీఐ నేత రామకృష్ణ తప్పుపట్టారు. హైదరాబాద్లో చికిత్స చేయించుకొని.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్కు లేఖ కూడా రాశారు.
డిప్యూటీ సీఎం నుంచి..
ఇటీవల కరోనా వైరస్ సోకిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నారు. తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కూడా భాగ్యనగరంలో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. తాజాగా వైరస్ సోకిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా అపోలోలో చేరారు. తనకు జ్వరం ఉందని.. మిగతా సమస్యలు లేవు అని బాలినేని స్వయంగా తెలిపారు. దీంతో ప్రజాప్రతినిధులకు ఏపీలో వైద్యులు అందిస్తోన్న ట్రీట్ మెంట్పై నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.
సాయిరెడ్డి కూడా..
ఇటీవల వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కూడా కరోనా వైరస్ కోసం హైదరాబాద్లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. 12 రోజుల తర్వాత కోలుకోవడంతో డిశ్చార్జ్ కూడా అయ్యారు. మరికొందరు మంత్రులు, నేతలు కూడా హైదరాబాద్ వచ్చి చికిత్స చేసుకునేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. దీంతో విపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎందుకు వైద్యం చేయించుకోవడం లేదు అని నిలదీస్తున్నారు. మీరు ఇలా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
రామకృష్ణ లేఖాస్త్రం..
అధికారపార్టీ నేతలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లడం సరికాదని సీపీఐ రామకృష్ణ అన్నారు. దీంతో రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటున్న సామాన్యులకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన నేతలే ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. సీఎం జగన్కు రాసిన లేఖలో నేతల వ్యవహారశైలిని తప్పుపట్టారు. ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని సూచించారు.