జగన్ టీం మంత్రులకు ఏమైంది..!! సమస్యలకు కారణం వారే : తలలు పట్టుకుంటున్న సీనియర్లు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. కొత్త సమస్యలకు కారణం అవుతున్నారు. మున్సిపల్ మంత్రి రాజధాని పైన ప్రకటన చేస్తామని చెబుతారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రగడ జరుగుతన్నా స్పష్టత ఉండదు. మరో మంత్రి రాజధాని తరలింపు పైన సమర్ధించను..ఖండించను అని చెబుతారు. మరో మంత్రి రాజధాని మార్పు లేదు..అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఎవరు నిజం చెబుతున్నారు. ప్రభుత్వంలో ఒక విధానం లేదా. ఒక స్పష్టత మంత్రులకు ఇవ్వటం లేదా. లేక అసవరం లేకున్నా..జోక్యం చేసుకుంటున్నారా. గతంలో అమ్మ ఒడి పధకం గురించి మంత్రి ప్రకటనతో అయోమయం ఏర్పడింది. ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యంతో సద్దుమణిగింది. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని వైసీపీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఏ రకంగా స్పందిచాలో తెలియక సతమతం అవతున్నారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తరువాత దీని పైన సీరియస్ గా చర్చించాలని నిర్ణయించారు.
ఎవరి ప్రకటనలు వారివే...
జగన్ కేబినెట్లోని మంత్రుల తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉందని పార్టీలోని సీనియర్లే వాపోతున్నారు. తాజాగా అమరావతి గురించి మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపింది. దీని పైన ప్రతిపక్ష పార్టీలే కాదు.. సామాన్య ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. రాజధాని పైన చర్చ జరుగుతోంది..త్వరోలనే ప్రకటన ఉంటుందంటూ బొత్సా కామెంట్ చేసారు. దీంతో..రాజధాని అమరావతి నుండి తరలి వెళ్లిపోతుందనే ప్రచారం మొదలైంది. దీనిని ప్రతిపక్ష టీడీపీ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. రాజధాని తరలింపు ఆలోచన చేస్తే కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రకటించారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని మాజీ మంత్రి పుల్లారావు స్పష్టం చేసారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం ఈ ఆలోచనను తప్పు బట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రిని తుగ్లక్ గా అభివర్ణించారు. అయితే, తమ మంత్రి అమరావతి మారుస్తున్నామని ఎక్కడైనా చెప్పారా అని వైసీపీ సీనియర్లు సమర్ధించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, అదే సమయంలో అమరావతి భవిష్యత్ లోనూ రాజధానిగా కొనసాగతుందనే విషయాన్ని కూడా బొత్సా స్పష్టం చేయలేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. అనుమానం కలిగేలా వ్యాఖ్యలు చేసి..ప్రజల్లో చర్చకు కారణమయ్యారు. సీనియర్ నేతలు ఈ వ్యవహారం పైన బయటకు సమర్ధించేలా మాట్లాడుతున్నా..లోలోపల మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని మార్పు లేదన్న గౌతంరెడ్డి..
రాజధాని గురించి మంత్రి బొత్సా వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతుంటే..ఆయన మాత్రం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దీని పైన చర్చ కోసమే ఇలా చేసారా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది. అయితే, పార్టీ సీనియర్లకు దీని పైన స్పష్టత లేకపోవటం..మంత్రి వ్యాఖ్యలను ఖండించలేక.. ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇదే సమయంలో మరో మంత్రి అవంతి శ్రీనివాస రావు తాను ఈ విషయాన్ని సమర్ధించను..వ్యతిరేకించను అంటూ తప్పించుకున్నారు. పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసలు అమరావతి నుండి రాజధాని తరలిస్తారని బొత్సా చెప్పలేదు కదా.. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని స్పష్టం చేసారు. మరి..బొత్సా అటువంటి వ్యాఖ్యలను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏ మంత్రి వద్ద సమాధానం లేదు. మరో వైపు ముఖ్యమంత్రి చెప్పకుండానే బొత్సా రాజధాని లాంటి సెంటిమెంట్ కూడిన అంశం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అనే చర్చ కూడా పార్టీలో కొనసాగుతోంది. అయితే, ఇటువంటి కీలక అంశాల పైన మంత్రివర్గంలో చర్చ లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. క్యాబినెట్ లో మాత్రం ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేసారు. ఖర్చు గురించే బొత్సా మాట్లాడరని ఆయన చెప్పుకొచ్చారు. మరి..అదే నిజమైతే బొత్సా వివరణ ఇస్తే అసలు సమస్యే ఉండదు కదా అంటే...ఆయన సీనియర్. ఆయనకు మేము ఎలా చెబుతాం..అని పార్టీ నేతలు సమాధానమిస్తున్నారు.
ముఖ్యమంత్రి స్పందించలేదేంటి..
ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రాజధాని గురించి పెద్ద ఎత్తున చర్చ..అయోమయం కొనసాగుతోంది. దీని పైన మంత్రులు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. మరి..దీని పైన ముఖ్యమంత్రి అందుబాటులో లేక పోయినా..ఆయన కార్యాలయం ద్వారా స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయటం లేదన్నది పార్టీలో అంతర్గత చర్చ. గతంలో అమ్మ ఒడి పధకం గురించి సంబంధిత మంత్రి చేసిన ప్రకటన అనేక విమర్శలకు కారణమైంది. దీంతో..వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం పధకం అమలు పైన స్పష్టత ఇచ్చి..సందేహాలను తొలిగించింది. మరి, ఇప్పుడు కీలకమైన రాజధాని గురించి ఆరోపణలు..విమర్శలు..చర్చలు సాగుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు స్పందించటం లేదన్నది ప్రశ్న. ఇక, ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో మంత్రులే బాధ్యత తీసుకోవాలి. కానీ., జగన్ ఏరి కోరి తెచ్చుకున్న మంత్రులు మాత్రం సమిష్టితత్వం లేదనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం ద్వారా మరింత అయోమయానికి కారణమవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ సీనియర్లలో చర్చకు కారణమైంది. దీని పైన మంత్రులనే సీనియర్లు తప్పు బడుతున్నారు.