టీడీపీ డ్రామా కంపెనీ, అసైన్డ్ భూముల పేరుతో అన్యాయం.. చంద్రబాబుపై మంత్రుల మండిపాటు..
టీడీపీ అధినేత చంద్రబాబుది ముగిసిన అధ్యాయం అని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానిలో చంద్రబాబును అడ్డుకునే అవసరం వైసీపీకి లేదన్నారు. రైతులకు అన్యాయం చేసినందుకే రాల్లు, చెప్పులు వేశారని పేర్కొన్నారు. రాజధానిలో మేం అడ్డుకోవాలనుకుంటే చంద్రబాబు ఒక్క అడుగు కూడా వేయలేరని కొడాలి నాని తేల్చిచెప్పారు. విజయవాడ రోడ్లపై ఆయన తిరిగినా.. పట్టించుకోరని పేర్కొన్నారు.
గోడలే..
అమరావతిలో మొండి గోడలు తప్ప ఏమున్నాయని మరో మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల పేరుతో అన్యాయం చేసి రైతుల ఉసురు పోసుకున్నారని గుర్తుచేశారు. అందుకోసమే రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైందని చెప్పారు. గత హయాంలో అన్యాయం జరిగిన వారిందరికీ న్యాయం చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు.
డ్రామా కంపెనీ
టీడీపీ రాజకీయ పార్టీ కాదు .. డ్రామా కంపెనీ అని మరో మంత్రి కన్నబాబు ఫైరయ్యారు. తనను ప్రజలు మరచిపోతారనుకొని.. పర్యటనలు చేపడుతున్నారని విమర్శించారు. మొన్న ఇసుక, ఇంగ్లీష్ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజధాని పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
రాళ్లతో దాడులు..
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన పూలతో స్వాగతం.. రాళ్లతో దాడిలా కొనసాగింది. రాజధాని ప్రాంతంలో ప్రత్యేక బస్సులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు బృందం బస్సు వెంకటాయపాలెం వద్దకు రాగానే ఆందోళనకారులు చెప్పు విసిరారు. దీంతో కలకలం రేగింది. చెప్పు విసిరింది ఆందోళనకారులు కాదని... వైసీపీ కార్యకర్తలని చంద్రబాబు ఆరోపించారు.
సరికాదు..
సీఎం జగన్పై చంద్రబాబు ఫైరయ్యారు. రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు. కానీ తాము అలా చేయలేదని, చేయబోమని చెప్పారు. అధికారం ఉందనే అండతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. 40-50 మంది పెయిట్ ఆర్టిస్టులతో దాడులు చేయించడం మీ సంస్కృతి అని విమర్శించారు.
సారీ చెప్పేందుకు సిద్ధం
అమరావతి రాజధాని విషయంలో తప్పు చేశానని భావిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని పేరుతో అవినీతి చేశామని చెబుతున్న వైసీపీ సర్కార్.. గత ఆరునెలల నుంచి ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాజధాని తమ పనితనం నచ్చకుంటే మెరుగ్గా చేయాలే తప్ప.. క్యాపిటల్ సిటీ మారుస్తామని చెప్పడం ఏంటీ అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిపై ఒక్కో మంత్రి ఒక్కోలాగా మాట్లాడుతారని మండిపడ్డారు.
శ్మశనమా..?
రాజధానిని ఓ మంత్రి శ్మశానంతో పోల్చడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. సభ్యత, సంస్కారం ఉన్న మంత్రి అలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. శ్మశానంలో ఉండి పనిచేస్తున్నారా అని నిలదీశారు. అసెంబ్లీ, కౌన్సిల్ శ్మశానంలో ఉందా ? ఇక్కడినుంచే మీరు చట్టాలు చేస్తున్నారా అని ఫైరయ్యారు. న్యాయం చెప్పే హైకోర్టు ఎక్కడ ఉంది ? ఇక్కడే కదా అని గుర్తుచేశారు. దీనిపై ఏమైనా మాట్లాడితే చాలు బూతు పురాణం వినిపిస్తున్నారని మండిపడ్డారు.