జగన్ ఆదేశాలు మంత్రుల బేఖాతర్..బుగ్గన సైతం: టీడీపీ నేతల మాటకే ప్రాధాన్యత: సీఎం సీరియస్..!
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను మంత్రులు బేఖాతర్ చేస్తున్నారు. పేషీల్లో మంత్రులు తమ సిబ్బంది విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసారు. తొలి కేబినెట్ సమావేశంలో పేషీల్లో సిబ్బంది నియామకం పైన స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సూచనలు చేసారు. జగన్ కేబినెట్లో మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు అవుతోంది. కానీ, ఇప్పటికీ సీఎం సూచనలు మాత్రం అమలు కావటం లేదు.
పాలన నుండి దిగిపోయిన మాజీ మంత్రుల మాటకే ప్రస్తుత మంత్రులు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అనేక మంది మంత్రులు తమ పేషీ అధికారులు..సిబ్బందిగా గతంలో టీడీపీ మంత్రుల వద్ద పని చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మాజీ మంత్రుల సిఫార్సు మేరకే వారు కొనసాగుతన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆర్దిక మంత్రి బుగ్గన సైతం ఉన్నారు. ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. పూర్తి వివరాలు ఇవ్వాలని తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు.
70 రోజుల్లోనే 98 మంది రైతుల ఆత్మహత్య ... ఇదేనా జగన్ పాలన అన్న మాజీ మంత్రి
Recommended Video
ముఖ్యమంత్రి ఆదేశాలు మంత్రుల బేఖాతర్..
ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి ఆదేశాలకు లోబడి పని చేయాల్సిందే. కానీ, ఏపీ ప్రభుత్వంలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల పైనే ఆగ్రహంతో ఉన్న జగన్ అనేక విమర్శలు వస్తున్నా..వాటి మీద విచారణ కొనసాగించాలని ముందుకు వెళ్తున్నారు. అయితే, మంత్రులు మాత్రం మరో మార్గంలో పయణిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు హాయంలో వివిధ మార్గాల్లో ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని తొలిగించారు. మంత్రులంతా తమ పేషీల్లో మార్పులు చేయాలని..గత ప్రభుత్వంలో పని చేసిన వారిని పేషీల్లో తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సూచనలు చేసారు. గత ప్రభుత్వంలో పని చేసిన వారికి..బంధువులకు అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేసారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఈ మేరకు అధికారికంగా నోట్ కూడా అన్ని మంత్రుల పేషీలకు సర్క్యులేట్ చేసారు. అయితే, కొందరు మంత్రులు మాత్రం దీనిని అమలు చేయటం లేదు.
బుగ్గన పేషీలో సైతం పాత సిబ్బందే..
స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా.. కొందరు మంత్రులు మాత్రం తమ పేషీల్లో టీడీపీ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందినే కొనసాగిస్తున్నారు. అందులో ఆర్దిక మంత్రి బుగ్గన సైతం ఉండటం చర్చకు కారణమైంది. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ వద్ద పీయస్ గా పని చేస్తున్న ధనుంజయ్ గతంలో టీడీపీలో మంత్రిగా పని చేసిన కాల్వ శ్రీనివాసులు వద్ద పీఎస్ గా వ్యవహరించారు. అదే విధంగా.. గతం లో కాల్వ శ్రీనివాసులు వద్ద ఓయస్డీగా పని చేసిన సత్యనారాయణ ఇప్పుడు హౌసింగ్ మంత్రి వద్ద ఓయస్డీగా కొనసాగుతున్నారు. అదే విధంగా గతంలో పరిటాల సునీత వద్ద ఓయస్డీగా పని చేసిన రామచంద్రా రెడ్డి ఇప్పుడు ఆర్దిక మంత్రి బుగ్గన వద్ద ఓయస్డీగా నియమితులయ్యారు. మొత్తం 25 మంది మంత్రులు జగన్ కేబినెట్లో కొనసాగుతండగా..అందులో 13 మంది మంత్రుల వద్ద గతంలో టీడీపీ మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందే కొనసాగుతున్నారు. దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయానికి పలువురు పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో..ఏకంగా 13 మంది మంత్రులు గత టీడీపీ హాయంలో మంత్రుల వద్ద పని చేసిన వారినే తమ వద్ద కొనసాగించటం ద్వారా తమ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు టీడీపీ నేతలకు చేరుతాయనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ సీరియస్..
గత ప్రభుత్వంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఒక వైపు చెబుతూ..తాను సంస్కరణల దిశగా నిర్ణయాలు తీసుకుంటుంటే మంత్రులు ఈ రకంగా నాటి ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పని చేసినవ వారికే ప్రాధాన్యత ఇవ్వటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తాను అమెరికా పర్యటనకు వెళ్లే లోగా దీని పైన మంత్రుల నుండి స్పష్టత తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. మాజీ మంత్రుల సిఫార్సుల మేరకే వీరు కొనసాగుతున్నారనే ఫిర్యాదులు జగన్ వద్దకు చేరినట్లు సమాచారం. వెంటనే మంత్రులు తమ కార్యాలయాల్లో పని చేస్తున్న మాజీ మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని తొలిగించాల్సిందేనని..ఇవి ముఖ్యమంత్రి ఆదేశాలంటూ సీఎంఓ సంబంధిత పేషీలకు సమాచారం పంపింది. అయితే, మంత్రులు మాత్రం దీనిని సీరియస్ గా తీసు కోవటం లేదు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో తన ఆదేశాలను భేఖాతర్ చేస్తున్న ఆ మంత్రుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.