నివర్ అలర్ట్: అధికారులతో మంత్రుల సమీక్ష.. సహాయ చర్యలపై నిర్దేశం
నివర్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగానే ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున.. అలర్ట్గా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య బృందాలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాజ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస చర్యలు, భోజన సదుపాయం, వైద్య సహాయం విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటు నెల్లూరు ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అనిల్కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో చెరువులు గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.
చిత్తూరు జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతోపాటు అన్ని వసతులు కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.