ముస్లింల సభ నిర్వహణపై రాష్ట్ర మంత్రుల సమీక్ష...వచ్చే ఎన్నికల్లో శెట్టి బలిజలకు జనసేన ప్రాధాన్యం
అమరావతి: 'నారా హమారా... టీడీపీ హమారా' నినాదంతో ఈనెల 28న గుంటూరులో నిర్వహించే ముస్లిం, మైనార్టీల సభ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు.
Recommended Video
''నారా హమారా.. టీడీపీ హమారా'' నినాదంతో ఈ నెల 28న గుంటూరులో నిర్వహించే సభకు మైనారిటీలు ఉత్సాహంగా తరలివచ్చేలా పార్టీ నేతలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నేపథ్యంలో ఈ సభ నిర్వహణను టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మైనారిటీల సంక్షేమానికి తాము చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మైనారిటీ నాయకులు, పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్థేశం చేశారు.
ముస్లింల సభ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, శిద్దా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్బాబు, ఎంపీలు గల్లా జయ్దేవ్, రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీలు, జిల్లా ఎమ్మెల్యేలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. సభ విజయవంతానికి రవాణా, వేదిక, పార్కింగ్, ఆహార కమిటీలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు జనసేన సరైన ప్రాధాన్యాన్ని ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. శెట్టిబలిజలతోపాటు వెనుకబడిన కులాలకు అండగా ఉంటానన్నారు. గతంలో ముమ్ముడివరం నియోజక వర్గ కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ తన అనుచరులతో కలిసి హైదరాబాద్లో జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని బాలకృష్ణ ఆయనతో చెప్పారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని ఈ సందర్భంగా ఆయన పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నానని పితాని బాలకృష్ణ తెలిపారు. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన 'కులాలను కలిపే ఆలోచన'ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.