రాజమండ్రి తొక్కిసలాటలో ట్విస్ట్: విద్రోహ కోణం, హర్షకుమర్కు లింక్?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాటలో విద్రోహ కోణం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. క్షతగాత్రులను పరామర్శించిన సమయంలో కరెంట్ వైర్లు తెగాయని కొందరు కేకలు వేశారని బాధిత మహిళ చెప్పారని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్థావించారని సమాచారం. తొక్కిసలాటకు కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ చేసిన దీక్షకు ముడిపెట్టారు.
అచ్చెన్నాయుడు చెప్పిన అంశాలకు మరో మంత్రి సుజాత బలపర్చారని తెలిసింది. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో విద్రోహ చర్య అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాగా గురువారం మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, పుష్కరాలకు రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
పుష్కరాలు మొదలు కావడానికి ముందు రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అక్కడ వేరేవారి సమస్యలపై దీక్ష చేశారని, హర్షకుమార్ను పోలీసులు అరెస్టు చేశారని అచ్చెన్ననాయుడు, పీతల సుజాత చెబుతూ హర్షకుమార్ నిరసనగా ఆయన అనుచరులు పుష్కరాల ప్రారంభ సమయంలో కరెంటు తీగలు తెగిపడ్డాయని, షాక్ కొడుతోందని ప్రజలను భయబ్రాంతులను చేశారని, దాని వల్లే తొక్కిసలాట జరిగిందని తమకు బయటి నుంచి సమాచారం వస్తోందని అన్నారు.
ఆ సంఘటనపై విచారణ జరిపించాలని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత కోరారు. ఇది కొత్త కోణమని, దీనిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి చేరుద్దామని చంద్రబాబు అన్నారు. తొలి రోజు తాను పుష్కరాల్లో పూజ ముగించి బయటకు వస్తున్నప్పుడు ఒక మహిళ తనను ఆపి కరెంటు తీగలు తెగి పడ్డాయని అంటున్నారని చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
తరలింపునకు సిద్ధం కండి..
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించడంపై దృష్టి పెట్టి మంత్రులు పనిచేయాలని, దశలవారీగా తరలింపు చేపట్టాలని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో ఆదేశించారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
విభజన చట్టంలో దీనిపై పూర్తి స్పష్టత ఉందని, కొత్త రాజధానిలో హైకోర్టు భవన నిర్మాణం జరిగిన తర్వాతే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి కొత్త హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు తరలుతుందని, అప్పటిదాకా ప్రస్తుతం ఉన్న ఏర్పాటే కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.