సీమలోనే పుట్టావా?: జగన్పై ఏపీ మంత్రుల విమర్శల దాడి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రులు, నేతలు విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రైతులకు సాగు, తాగునీరు అందిస్తుంటే... ఏపీ సీఎం చంద్రబాబు దొంగతనం చేస్తున్నారని జగన్ తన పత్రికలో పేర్కొనడం దారుణమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.
సీమలోనే పుట్టారా?
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదలచేసే విషయంపై జగన్ తన పత్రిక ద్వారా తెలంగాణలో విష ప్రచారం చేయడం దారుణమని కేఈ అన్నారు. రాయలసీమపై ఎందుకు విషం కక్కుతున్నావు? ఇక్కడివారు మీకు మనుషుల్లా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘మీరు అసలు రాయలసీమలోనే పుట్టారా? అన్న అనుమానం కలుగుతోంది' అని కేఈ కృష్ణమూర్తి ధ్వజమెత్తారు.
విషం చిమ్ముతున్నారు..
పుట్టిన సీమపైనే జగన్ విషం చిమ్ముతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. సీమకు నీరిస్తే ఓర్చుకోలేని ప్రతిపక్షనేత తన సొంత మీడియా ద్వారా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు.
రైతు ద్రోహి..
సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకొంటూ రైతులకు ద్రోహం చేస్తున్నావంటూ జగన్పై మంత్రి ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకపోతే జనం తిరగబడతారని హెచ్చరించారు.
జగన్ పార్టీకి భవిషత్య లేదు..
కాగా, రాష్ట్రంలో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ నేత ఆత్మపరిశీలన చేసుకుని, కేడర్కు దిశానిర్దేశం చేయకుండా, తెలుగుదేశంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటున్నదని, పొలిటికల్ క్యారెక్టర్ లేని ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదని విశాఖలో డొక్కా స్పష్టం చేశారు.