బీజేపీకి దగ్గరయ్యేందుకే జగన్ పై మతపర ఆరోపణలు: పవన్ కు పిచ్చెక్కి: మంత్రి వెల్లంపల్లి..!
కొద్ది రోజులుగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకుంటూ..టీడీపీ..జనసేన మతపరమైన విమర్శలు చేస్తోంది. దీని పైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కొన లేక మతపరమైన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు సైతం ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్లో మతరపరమైన ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. జగన్ నాడు వైయస్ తరహాలోనే వేంకటేశ్వర స్వామి మీద భక్తితోనే పాదయాత్ర ముందు..తరువాత నడుచుకుంటూ కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి ఇటువంటి రకమైన విమర్శల ద్వారా బీజేపీని ఆకర్షించే ప్రయత్నం సాగుతోందన్నారు. పార్టీ ఎమ్మెల్యే విష్ణు జనసేన అధినేత పవన్ కళ్యాన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా..
మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇసుక దీక్షకు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరగకుండా టీడీపీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానిలో భాగంగానే పలువురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం...
తిరుపతి.. శ్రీశైలం.. విజయవాడ ఐ ల్యాండ్లో అన్యమత ప్రచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమలలో సోలార్ ప్యాన్లను శిలువగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారుని వివరణ ఇచ్చారు. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హిందూ దేవాలయాల అభివృద్ధి కొరకు తొలి బడ్జెట్లోనే రూ. 234 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసారు.
ప్రజలను తప్పు దోవ పట్టించటానికే..
గత ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైనా.. టీడీపీ నేతలకు బుద్ధి రావడంలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. సీఎం జగన్పై కుట్రతోనే చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నంలో తాముంటే.. ఇలా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాంమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలోనే విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని... రాజమండ్రి పుష్కరాల్లో బాబు ప్రచారం కోసం భక్తుల ప్రాణాలు తీశారని ఆరోపించారు. అర్చకుల మేలు కోసం చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు.