ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేయనున్న బాబు..! రెండు స్థానాలపై ఉత్కంఠ..!!
అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రేదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఒకటి, అధికార టీడీపీ పక్షానికి నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది. బుధవారం చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేస్తారని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.
ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే అవకాశం ఉన్నది నాలుగు స్ధానాలే అయినా ఆశావాహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అకోశ్ బాబును ఎమ్మెల్సీ చేస్తానని ఆయన పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రకటించారు. ఇక ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వక తప్పదు. మిగిలిన రెండు స్ధానాలకు ఎవరిని ఎంపిక చేస్తారో అని టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.