ఏపీ ఎంపీలకు రైల్వే బోర్డు చైర్మన్ దిమ్మతిరిగే షాక్!..
ఆయన సమాధానంతో షాక్ తిన్న ఎంపీలు.. రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల రెండు దశాబ్దాల కల అని గుర్తు చేశారు.
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ కావాలనే డిమాండ్ దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి చర్చల్లో నానుతూనే ఉంది తప్పితే ఆచరణకు మాత్రం నోచుకోలేదు. రైల్వే బోర్డు సమావేశాల్లో ఎన్నిసార్లు ఈ అంశాన్ని లేవనెత్తిన అధికారులు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఎంపీలు వాపోతూ వస్తున్నారు.
తాజాగా రైల్వే బోర్డు చైర్మన్ నుంచి ఏపీ ఎంపీలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏపీకి రైల్వే జోన్ ఎందుకు? అని రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ ప్రశ్నించడంతో ఎంపీలు ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం నాడు మిట్టల్ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా.. విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయన్ను కలవడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అంశాన్ని మిట్టల్ ముందు ప్రస్తావించగా.. రైల్వేలు అన్ని వసతులు కల్పిస్తున్నప్పుడు ఏపీకి ప్రత్యేకంగా రైల్వేజోన్ ఎందుకని ఆయన ప్రశ్నించారట. ఆయన సమాధానంతో షాక్ తిన్న ఎంపీలు.. రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల రెండు దశాబ్దాల కల అని గుర్తు చేశారు. ఆపై తన వ్యాఖ్యలను కప్పి పుచ్చుకునేలా..ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ అనేది రాజకీయ నిర్ణయమని, అది తమ చేతుల్లో లేదని ఎంపీలకు నచ్చజెప్పేందుకు మిట్టల్ ప్రయత్నించారు.
మిట్టల్ వాదనతో రాష్ట్ర విభజన హామిల్లో రైల్వే జోన్ కూడా ఉందని గుర్తుచేశారు. అలాగే విశాఖ-ఢిల్లీ మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలు టైమింగ్స్ మార్చాలని కోరారు. వాల్తేరు డివిజన్కు కేంద్రం రూ.690 కోట్లు కేటాయించినా.. ఇంతవరకు ఒక్క పని కూడా ప్రారంభమైన దాఖలా లేదన్నారు.