రెడ్లైట్ చూడనిదే గొంతు దిగదంటూ.. బాబుకు విజయసాయి, జగన్కు పద్మశ్రీ.. రాజన్న రాజ్యంపై కౌంటర్లు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు వైరస్ వ్యాప్తిపై రాజకీయ విమర్శలూ పెరిగాయి. చంద్రబాబు లూటీచేసి వదిలేసిన రాష్ట్రాన్ని.. సీఎం జగన్ కోలుకునేలా చేశారని, ఏడాది నిండకముందే రాజన్న రాజ్యం వచ్చేసిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పగా.. ''ఇది రాజన్న రాజ్యం కాదు.. రౌడీల పాలన''అంటూ సీఎంపై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు. డాక్టర్లకు కూడా మాస్కులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావుపై విశాఖపట్నం పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు.
మళ్లీ తెరపైకి.. రెండో సారీ వైరల్..
కరోనా కట్టడి చర్యల్లో సీఎం జగన్ ఫెయిలయ్యారని, డాక్టర్లకు కూడా మాస్కులు అందడంలేదంటూ సంచలన ఆరోపణలు చేసి, సస్పెండైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు.. శనివారం సడెన్ గా విశాఖపట్నంలో ప్రత్యక్షం కావడం.. గుండుతో చొక్కాలేకుండా ఉన్న ఆయనను పోలీసులు కొట్టి, చేతులు కట్టేసి, ఈడ్చుకుంటూ వెళ్లడం తెలిసిందే. సుధాకర్ రావు మద్యం మత్తులో రోడ్లుపై రచ్చ చేసినందుకే అరెస్టు చేశామన్న పోలీసులు.. చికిత్స కోసం ఆయనను మెంటల్ ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు. డాక్టర్ ను లాఠీతో చితగ్గొట్టిన కారణంగా ఏపీ సర్కారు ఓ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేసింది. రెండు సందర్భాల్లోనూ ఆయనకు సంబంధించిన వీడియోలు దేశమంతటా వైరల్ అయ్యాయి.
ప్రశ్నిస్తే పిచ్చెక్కిందంటారా?
డాక్టర్ సుధాకర్ రావు అరెస్టు వ్యవహారంపై టీడీపీతోపాటు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీ సర్కారుపై విమర్శలకు దిగింది. విశాఖలో నడిరోడ్డు మీద దళిత డాక్టర్ సుధాకర్ చేతులు కట్టేసి , కొట్టి , ఈడ్చుకు వెళ్ళటం అమానుషమని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గతంలో రైతుల్ని, మహిళల్ని, వసల కూలీల్ని సైతం కొట్టారు.. ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నించోబెట్టారు.. ఇప్పుడు ఓ డాక్టర్పై పిచ్చివాడిగా ముద్రవేశారు.. ఇది రాజన్న రాజ్యం కానేకాదు.. పచ్చి రౌడీ పాలన'' అని సీఎం జగన్పై పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములపై బాబు రాజకీయం..
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వరుసగా విమర్శల దాడి చేస్తోన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఆదివారం భూముల అంశాన్ని ప్రస్తావించారు. పేదలకు పంచడం కోసం ఏపీ సర్కారు ఆయా జిల్లాల్లో సేకరించిన భూములపై వివాదాలు సృష్టించేందుకు టీడీపీ చీఫ్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. జగన్ సర్కారు పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తేగనుక.. ఇక టీడీపీకి పుట్టగతులుండవనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నారని ఎంపీ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు పంచరాదంటూ కోర్టు స్టే ఇవ్వడంపై టీడీపీ సంబరపడిపోతున్నదని విమర్శించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8 రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించడం తెలిసిందే.
రెడ్లైట్ చూడనిదే..
టీడీపీ నేత చంద్రబాబుకు ఫేకుడు తప్ప మరేపనీ చేతకాదంటూ విజయసాయి అనూహ్య కామెంట్లు చేశారు. ‘‘రోజుకు కనీసం రెండు గంటలైనా మైకు ముందు ఉపన్యాసం దంచాలి. వీడియో కెమెరాలు రికార్డు చేసేటప్పుడు వెలిగే రెడ్ లైట్ బాబుకు కనిపించాలి. లేకపోతే ఆయన గొంతులోకి ముద్ద దిగదు. మనవడితో కాసేపు ఆడుకుని, ఎల్లో ఛానల్స్ లో తన బొమ్మలను చూసుకున్నాకే నిద్రపోతాడు. ప్రజల గురించి ఆందోళన, కార్యకర్తలకు దిశానిర్ధేశం అంతా ఫేకుడే''అని ఎంపీ దుయ్యబట్టారు.
Recommended Video
ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావును విశాఖలో పోలీసులు అవమానించి తీరు, పిచ్చివాడిగా ముద్రవేయడంపై జాతీయ స్థాయిలో పోరాడుతామని టీడీపీ నేతలు చెప్పారు. నేరస్తులు, ఉగ్రవాదులపట్ల అనుసరించినట్లుగా ఒక డాక్టర్ పై దమనకాండకు దిగడం దారుణమని, దళితుడు కాబట్టే ఆయనపై జగన్ సర్కారు అకృత్యానికి పాల్పడిందని, ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.